భర్తను చంపేందుకు భార్య తన ప్రియుడుతో కలిసి ప్లాన్ వేసన ఘటన చిత్తూరు జిల్లాలో కలకలం రేపింది. పలమనేరు మండలంలో భర్తను చంపడానికి ప్రయత్నించిన కేసులో ప్రధాన నిందితులైన భార్య శిల్ప, ఆమె ప్రియుడు ఎం. వెంకటేష్ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మీలో ఉద్యోగం చేస్తున్న సి. వెంకటేశులు భార్య శిల్పకు ఎం. వెంకటేష్తో అక్రమ సంబంధం ఉందనే విషయం భర్తకు తెలిసింది. దీంతో శిల్ప తన ప్రియుడితో కలిసి భర్తను అడ్డు తొలగించుకోవాలని పథకం వేసింది. ఈ కుట్రలో భాగంగా గత మే 16వ తేదీన భర్త వెంకటేశులుపై వేడి నూనె పోసి హత్యాయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ దారుణానికి పాల్పడిన వెంటనే నిందితులిద్దరూ అక్కడి నుండి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన బాధితుడు సి. వెంకటేశులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ సమయంలోనే కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు శనివారం నిందితులు శిల్ప, ఎం. వెంకటేష్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, ఇతర కోణాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.









