నటి అను ఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel) తన సినీ కెరీర్కు సంబంధించి కీలకమైన ప్రకటన చేశారు. ఇటీవల విడుదలైన ‘ది గర్ల్ఫ్రెండ్’ చిత్రంలో తన పాత్రకు లభించిన ప్రశంసల నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆమె, తన ప్రయాణంలో సంతృప్తినిచ్చే పాత్రలు మాత్రమే చేయాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వంటి అగ్ర హీరోలతో పనిచేసినప్పటికీ, కొన్ని రొటీన్ కమర్షియల్ సినిమాలు చేయకుండా ఉంటే బాగుండేదని ఆమె అభిప్రాయపడ్డారు. కేవలం కమర్షియల్ అంశాలు మాత్రమే ఉండే పాత్రలు నటిగా తనకు పూర్తి సంతృప్తిని ఇవ్వలేకపోయాయని, అందుకే ఇకపై కథకు ప్రాధాన్యతనిచ్చే, బలమైన పాత్రలతో కూడిన సినిమాలను మాత్రమే ఎంచుకుంటానని అను ఇమ్మాన్యుయేల్ అంటుంది.

Also Read..| మీ బరువెంత.? ప్రెస్ మీట్ లో నటి గౌరీ కిషన్ కు చేదు అనుభవం
ఆపాత్ర సంతృప్తినిచ్చింది: అను ఇమ్మాన్యుయేల్
‘ది గర్ల్ఫ్రెండ్’ చిత్రంలో తాను పోషించిన ‘దుర్గ’ పాత్ర తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని, నటనలో కొత్తదనాన్ని నేర్చుకోవడానికి ఈ సినిమా అవకాశం ఇచ్చిందని అను చెబుతుంది. ఈ చిత్రంలో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ హాలీవుడ్ తరహాలో హీరో, విలన్ అనే తేడా లేకుండా ప్రతి పాత్రకూ కథను ముందుకు నడిపేందుకు ప్రాధాన్యం ఇచ్చారని, ఇది ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని అంటుంది. ప్రస్తుతం కొన్ని కొత్త ప్రాజెక్ట్లు చర్చల దశలో ఉన్నాయని, వాటి వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని అంటుంది ఈ బ్యూటీ.









