మొంథా తుఫాను సృష్టించిన బీభత్సం, నష్టంపై రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆర్టీజీఎస్ (రియల్-టైమ్ గవర్నెన్స్ సిస్టమ్స్) కేంద్రంలో వరుసగా మూడో రోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తుఫాను తీవ్రత, ఇప్పటివరకు వివిధ జిల్లాల్లో జరిగిన నష్టంపై ఆయన ఉన్నతాధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
తుఫాను వల్ల సంభవించిన నష్టంపై ప్రాథమిక అంచనాలను త్వరితగతిన రూపొందించాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. నష్ట తీవ్రతకు అనుగుణంగా సహాయక చర్యలను మరింత వేగవంతం చేసేందుకు ఈ ప్రాథమిక అంచనాలు ఉపయోగపడతాయని ఆయన అన్నారు.

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ అంశంపై మంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించారు. దీనికి సంబంధించి అధికారుల వద్ద ఆరా తీశారు. కోనసీమ, కృష్ణా, బాపట్ల, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడినట్టు వారు మంత్రికి వివరించారు. ముంపు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు సత్వర చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు.
Also Read..| తెలంగాణ కేబినెట్ వస్తరణ.. అజారుద్దీన్ కు మంత్రి పదవి..?
తుఫాను బాధిత ప్రజలకు అండగా ఉండాలని మంత్రి లోకేష్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వారు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి, బాధితులకు అవసరమైన అన్ని సహాయక చర్యలను చేపట్టాలని, ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని ఆయన పార్టీ శ్రేణుకలను కూడా ఆదేశించారు.









