మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో మహావికాస్ అఘాడి కూటమి విజయం తధ్యమని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నాందేడ్ ప్రాంతంలో ఆయన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో కలిసి వివిధ సభల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగా రైతులకు న్యాయం జరగాలంటే మహాఅఘాడి కూటమి అధికారంలోకి రావలసిన అవసరం ఉందని అన్నారు. మహా వికస్ అఘాడి కూటమిలో భాగస్వామ్యమైన కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఇచ్చిన హామీలను మాట తప్పకుండా అమలు చేస్తూ ఇందిరమ్మ రాజ్యాన్ని తెస్తోందని ఆయన తెలిపారు. ప్రస్తుత దేశ, రాష్ట్ర పరిస్థితుల నేపథ్యంలో అఘాడి కూటమిని గెలిపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన స్పష్టం చేశారు. మహారాష్ట్రలో మహా అఘాడి కూటమి గెలుపు ఖాయమని ఇప్పటికే ఆ దిశగా సంకేతాలు కనిపిస్తున్నాయని మంత్రి పొంగులేటి అన్నారు.