రాష్ట్రంలో జనగణన (census) నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం కీలకమైన షెడ్యూల్ను ఖరారు చేసింది. దీని ప్రకారం, మే 11 నుండి జూన్ 9 వరకు మొదటి విడత ప్రక్రియ కొనసాగనుంది. ఇక తుది దశ గణనను 2027 ఫిబ్రవరి 9 నుంచి 28 వరకు నిర్వహించనున్నట్లు సెన్సెస్ డైరెక్టర్ భారతి హోలికేరీ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ సర్వేలో భాగంగా ప్రజల జీవనశైలి, వసతులు, ఇతర సామాజిక అంశాలకు సంబంధించి మొత్తం 33 రకాల ప్రశ్నలు అడగనున్నారు.
జనగణన చివరిసారిగా 2011లో..
దేశంలో చివరిసారిగా 2011లో జనగణన జరిగింది. వాస్తవానికి 2021లోనే ఇది జరగాల్సి ఉన్నప్పటికీ, కోవిడ్-19 వ్యాప్తి కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. సుమారు 16 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ప్రక్రియ మళ్ళీ మొదలవుతుండటంతో దీనికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఈసారి డేటా సేకరణను పూర్తిగా డిజిటల్ పద్ధతిలో చేపట్టనున్నారు. ఎన్యూమరేటర్లు తమ మొబైల్ ఫోన్లలోని ప్రత్యేక యాప్ లేదా పోర్టల్ ద్వారా ఇంటింటికీ వెళ్లి వివరాలను నమోదు చేస్తారు.
ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధి పనులకు, సంక్షేమ పథకాల రూపకల్పనకు జనగణన గణాంకాలే ప్రాతిపదిక. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), రిజర్వేషన్ల ఖరారు వంటి కీలకమైన రాజకీయ, సామాజిక నిర్ణయాలు ఈ సర్వే ఆధారంగానే జరుగుతాయి. అందుకే ప్రజలందరూ ఈ ప్రక్రియలో భాగస్వాములు కావాలని, ఎన్యూమరేటర్లు అడిగే ప్రశ్నలకు సరైన సమాచారం అందించి సహకరించాలని అధికారులు కోరుతున్నారు. సమాచారం ఇవ్వడంలో ఎవరైనా ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహించినా లేదా నిరాకరించినా చట్టప్రకారం రూ. 1,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.









