ఆపరేషన్ సింధూర్ పై పార్లమెంటులో చర్చ జరగనుంది. పహల్గామ్ ఉగ్రదాడి, అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) నేపథ్యంలో భారత పార్లమెంట్ కీలక చర్చకు సిద్ధమవుతోంది. దేశ భద్రత, ఉగ్రవాద నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన “ఆపరేషన్ సింధూర్” పై లోక్సభలో జులై 28న, రాజ్యసభలో జులై 29న సుదీర్ఘ చర్చ జరగనుంది. ఒక్కో సభలో 16 గంటల పాటు చర్చించేందుకు సమయం కేటాయించారు.

పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ దాడికి ప్రతీకారంగా, భారత్ “ఆపరేషన్ సింధూర్”ను ప్రారంభించి, పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లలోని ఉగ్రవాద స్థావరాలపై వైమానికి దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది. ఆతర్వాత పాకిస్తాన్ వెనక్కి తగ్గి శాంతి చర్చలకు మొగ్గు చూపింది. అయితే, “ఆపరేషన్ సింధూర్” ఇంకా ముగియలేదని భారత్ స్పష్టం చేస్తూనే ఉంది.

రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ కీలక చర్చను ప్రారంభిస్తారు. ఈచర్చలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విదేశాంగమంత్రి జైశంకర్, లోక్ సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, సమాజ్ వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్, ఇతర ఎంపీలు పాల్గొంటారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన తర్వాతే కేంద్ర ప్రభుత్వం ఆరరేషన్ సింధూర్ యుద్దాన్ని ఆపిందని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అంతేకాకుండి దేశంలో భద్రతా వైఫల్యాలు, ప్రభుత్వం తీసుకున్న చర్యలను పార్లమెంటులో విపక్షాలు లేవనెత్తే అవకాశం కనిపిస్తోంది. ఇటు అధికార పక్షం కూడా ప్రతిపక్షాల విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పేందుకు సిద్దమవుతోంది. చర్చలో పట్టు సాధించేందుకు అధికార, ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి. ఈచర్చ ద్వారా ఆపరేషన్ సింధూర్ మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించే అవకాశం కనబడుతోంది.









