ఇందిరా మహిళాశక్తి పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల సభ్యులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం ప్రజాభవన్లో జరిగిన అధికారుల సమావేశంలో ఆయన ఈ విషయం స్పష్టం చేశారు. స్వయం సహాయక సంఘాల ఫెడరేషన్ల ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున సోలార్ పవర్ ఉత్పత్తికి త్వరితగతన చర్యలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల ఫెడరేషన్లకు అవసరమైన స్థలాలను సేకరించి వారికి లీజుకు ఇవ్వాలని తెలిపారు. సోలార్ పవర్ ఉత్పత్తికి అవసరమైన ఆర్థిక నిధులకు గాను బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి రుణాలు ఇప్పించే ఏర్పాట్లు చేయాలని తెలిపారు. రుణాల రీ పేమెంట్ లో స్వయం సహాయక సంఘాల సభ్యులు 99 శాతం ప్రగతిని కనబరుస్తున్నారని, వీరికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ఆసక్తిగా ఉన్నారని చెప్పారు . ఇటీవల బ్యాంకర్ల సమావేశంలోనూ స్వయం సహాయక సంఘాల సభ్యులు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు సోలార్ పవర్ ఉత్పత్తి ప్లాట్ల ఏర్పాటు, ఆర్టీసీకి బస్సుల సమకూర్చేటువంటి మరిన్ని పథకాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానున్నట్టు స్పష్టం చేశామని, వారు కూడా విరివిగా రుణాలు అందించి ఆర్థికంగా ప్రోత్సాహం అందిస్తామని స్పష్టం చేసిన విషయాన్ని డిప్యూటీ సీఎం అధికారులకు వివరించారు.
Also Read..| నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి.. కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ
మహిళా సంఘాలకు ఆర్థిక చేయూతను ఇవ్వడం ద్వారా, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం ద్వారా సామాజిక మార్పు సాధించేందుకు అవకాశం ఏర్పడుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు. స్వయం సహాయక సంఘాలు ఆర్థికంగా బలపడితే గ్రామీణ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం అయ్యేందుకు అవకాశం ఏర్పడుతుందని అధికారులకు డిప్యూటీ సీఎం వివరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్, SERP సీఈఓ దివ్య దేవరాజన్, ట్రాన్స్కో సీఎం డి కృష్ణ భాస్కర్, రెడ్కో వైస్ చైర్మన్,ఎండి వావిలాల అనీల తదితరులు పాల్గొన్నారు.