ఎంఎంటీఎస్ రైలులో అత్యాచార యత్నం ఘటనలో గాయపడిన బాధితురాలిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. శనివారం సాయంత్రం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను పరమిర్శించారు. అనంతపురం ఉరవకొండకు చెందిన అఫ్రోజా అనే యువతి ఈ దాడిలో తీవ్రంగా గాయపడింది. దాడి విషయం తెలుసుకున్న బీజేపీ మహిళా మోర్చా నాయకులు వెంటనే స్పందించి ఆమెను యశోద ఆసుపత్రిలో చేర్పించారని కిషన్ రెడ్డి తెలిపారు. వైద్యులు ఆమెకు ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. యువతి వైద్య ఖర్చులను తామే భరిస్తామని, అన్ని విధాలుగా ఆమెకు అండగా ఉంటామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు.
Also Read…| బడ్జెట్ లో అంకెల గారడితో ప్రజలను మోసం చేశారు: కిషన్ రెడ్డి
యువతి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ నియోజకవర్గానికి చెందినవారని.. ఆయనతో కూడా మాట్లాడతానని కిషన్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు పంపించిన తర్వాత కూడా ఆమె ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించడానికి ఏపీ ఆరోగ్య మంత్రితో కూడా మాట్లాడతానని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి కొందరు నిందితులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని తెలిపారు. రైల్వే లా అండ్ ఆర్డర్ డీజీతో కూడా మాట్లాడానని, యువతి వాంగ్మూలం తీసుకుని తదుపరి దర్యాప్తు కొనసాగిస్తారని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.