తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan ReddY) తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ బడ్జెట్ను ‘దున్నపోతుకు పాలు పిండినట్లు‘గా అభివర్ణించారు. రాష్ట్ర ప్రభుత్వం అసమర్థతకు ఈ బడ్జెట్ నిదర్శనమని ఆయన మండిపడ్డారు. అట్టహాసంగా ప్రకటించిన గ్యారెంటీల అమలుపై ప్రజలు ఆశలు వదులుకునేలా పద్దుల రూపకల్పన జరిగిందని కిషన్ రెడ్డి అన్నారు. అంకెల గారడీతో తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేశారని విమర్శించారు.
పదేళ్లపాటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అగాదంలోకి నెట్టేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని పెనంపైనుంచి పొయ్యిలోకి పడేసినట్లు చేసిందని కిషన్ రెడ్డి అన్నారు. గతేడాది బడ్జెట్ పెట్టినపుడు తొలి ఏడాదే కదా అని తప్పించుకున్నారని, మరి 15 నెలలపాటు పాలించిన తర్వాత కూడా 6 గ్యారెంటీలు, 420 వాగ్దానాల అమలును పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. వివిధ ప్రాజెక్టులకు భారీగా ప్రకటనలు చేసినా, కేటాయింపులు ఆచరణ శూన్యమని ఈ బడ్జెట్ ద్వారా స్పష్టమైందని కిషన్ రెడ్డి అన్నారు.
ప్రభుత్వ ఆదాయం, రాబడిపై కనీస అవగాహన లేకుండా అంచనాలు రూపొందించారని కిషన్ రెడ్డి విమర్శించారు. 2024-25 బడ్జెట్లో జీఎస్టీ ఆదాయాన్ని రూ.58,594 కోట్లుగా చూపించారని, కానీ సవరించిన అంచనాల్లో రూ.5వేల కోట్లు తగ్గించి రూ.53,665 కోట్లుగా వెల్లడించారని తెలిపారు. అంటే దాదాపు 8.5% శాతం జీఎస్టీ వసూళ్లు తగ్గాయని, దీనికి కారణాలు రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. 2025-26 సంవత్సరానికి గానూ రూ.59,704 కోట్ల జీఎస్టీ వసూళ్లు ఉంటాయని బడ్జెట్లో పేర్కొన్నారని, ఇందులో లెక్కలు పెంచి ఎంత రాశారో అర్థం కావడం లేదని కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంచనాలను మించి అత్యుత్సాహంతో లెక్కలను ప్రకటించిందని ఆరోపించారు.
రాష్ట్రంలో మద్యం వినియోగాన్ని పెంచి దాని ద్వారా ఆదాయం పెంచుకోవడంపైనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టడం దురదృష్టకరమని కిషన్ రెడ్డి అన్నారు. 2024-25లో ఎక్సైజ్ టాక్స్ ద్వారా రూ.25,617 కోట్ల అంచనాలు ప్రకటించిన సర్కారుకు, ఈసారి బడ్జెట్లో రూ.27,623 కోట్ల ఆదాయాన్ని ఎక్సైజ్ ద్వారా రావొచ్చని అంచనా వేస్తోందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రజలను మద్యానికి బానిసలు చేసి ప్రజల ఆర్థిక వనరులను కొల్లగొట్టాలనేది కాంగ్రెస్ సర్కారు ఆలోచన స్పష్టంగా కనబడుతోందని కిషన్ రెడ్డి విమర్శించారు. ఇలా ప్రతిచోటా అంచనాలను పెంచి రాష్ట్ర ఆదాయాన్ని దాదాపు 12% ఎక్కువగా చూపిస్తున్నారని ఆరోపించారు.
రైతులను, యువతను, విద్యార్థులను, మహిళలను, వృద్ధులను, ఉద్యోగులను ఇలా ప్రతి వర్గాన్ని అత్యంత దారుణంగా మోసం చేస్తూనే ఉన్నారని కిషన్ రెడ్డి అన్నారు. నిరుద్యోగ భృతి గురించి మొత్తం బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడా పేరుకైనా లేదని తెలిపారు. గత బడ్జెట్లో 60వేల కోట్ల అప్పులు తీసుకుంటామని చెప్పి లక్షన్నర కోట్ల అప్పులు తీసుకున్నారని (స్పెషల్ పర్పస్ వెహికల్స్ పేరుతో తీసుకున్న రుణాలు కలుపుకుని), ఇప్పుడు 74 వేల కోట్లు అని చెప్పారని, అంటే ఇది 2.25 లక్షల కోట్లు దాటిపోతుందని ఆరోపించారు. అప్పుల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీరును తలదన్నేలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని విమర్శించారు.
వ్యవసాయానికి 72,659 కోట్లు అని గత బడ్జెట్లో చెప్పారని, అందులోనే రైతు రుణమాఫీ యాడ్ చేశారని, కనీసం ఆ రుణమాఫీ కూడా పూర్తిగా అమలు చేయలేదని కిషన్ రెడ్డి అన్నారు. ఈసారి రుణమాఫీ ఊసు లేకుండానే వ్యవసాయ రంగానికి రూ.24,439 కోట్లు కేటాయించారని తెలిపారు. ఏ ఆకాంక్షలతోనైతే రైతులు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారో, వారి ఆకాంక్షలను తుంగలో తొక్కారని విమర్శించారు. కౌలు రైతులు, రైతు కూలీల సంగతి మరీ దారుణమని, కౌలురైతులకు ఎకరానికి రూ.15వేలు, రైతు కూలీలకు ఎకరానికి రూ.12వేలు ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ తెలంగాణలో ఇంతవరకు ఏ ఒక్క రైతు కూలీకి, ఏ ఒక్క కౌలు రైతుకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని కిషన్ రెడ్డి అన్నారు. చెప్పింది చేయకుండా, చేయనిది చేసినట్లు చెప్పుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటని విమర్శించారు.
Also read.. | ఈ బడ్జెట్ రేవంత్ రెడ్డి అసమర్థతకు నిదర్శనం: కేటీఆర్
విద్యారంగానికి 2025-26 బడ్జెట్లో కేవలం 7.5% నిధులే (రూ.23,108 కోట్లు) కేటాయించారని, కానీ ఎన్నికల మేనిఫెస్టోలో 15% నిధులు విద్యారంగానికి ఖర్చుచేస్తామనే హామీని అసెంబ్లీ సాక్షిగా తుంగలో తొక్కారని కిషన్ రెడ్డి అన్నారు. ఇది తెలంగాణ విద్యార్థులను నిట్టనిలువునా మోసం చేయడమేనని విమర్శించారు. ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్యాభరోసా కార్డు ఎక్కడకు పోయిందో బడ్జెట్లో చెప్పలేదని తెలిపారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి కేటాయించే నిధుల్లోనూ కేటాయింపులు సగానికిపైగా తగ్గాయని కిషన్ రెడ్డి అన్నారు. హామీల్లో అన్నిరకాల పింఛన్లను రూ.4వేలకు పెంచి ఇస్తామని చెప్పి ఇంతవరకు కనీస పింఛన్లు కూడా ఇవ్వడం లేదని, ఈసారి కూడా వీటిపై ఊసులేదని, ఇది చాలా దారుణమని కిషన్ రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో వైద్యం పడకేసిందని, కనీస వసతుల్లేక గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అయినా వైద్యరంగానికి బడ్జెట్ పెంచలేదని కిషన్ రెడ్డి అన్నారు. ఇది పేదలకు కనీస వైద్యం అందకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడటంగానే భావించాలని విమర్శించారు. సమగ్ర సర్వే పేరిట బీసీల సంఖ్యను తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లోనూ వారిని నిట్టనిలువునా మోసం చేసిందని కిషన్ రెడ్డి అన్నారు. ఏడాదికి 20వేల కోట్లతో ఐదేళ్లలో లక్షకోట్లు ఇస్తామని చెప్పినా, అమలులో అతీగతీ లేదని తెలిపారు. వివిధ కార్పొరేషన్లకు కూడా నిధులను విడుదల చేయకుండా వాటిని పేరుగొప్ప ఊరు దిబ్బ అన్నట్లు మార్చారని కిషన్ రెడ్డి అన్నారు.
మొత్తం 3 లక్షల 4 వేల కోట్ల బడ్జెట్లో 2.26 లక్షల కోట్ల బడ్జెట్ (74%) ఖర్చుగా (వేతనాలు, సబ్సిడీలు, ఇతర ఖర్చులు), కేవలం రూ.36,504 కోట్లు (12%) మూలధన వ్యయంగా (మౌలికవసతులు, ఉద్యోగాలు, దీర్ఘకాల అభివృద్ధి ప్రాజెక్టుల మీద) ఖర్చు చేస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. ఈ బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం 12% మాత్రమే అభివృద్ధికి కేటాయించడం శోచనీయమని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కుంటుపడితే, రాష్ట్ర ఆదాయం తగ్గుతుందని, ఆదాయం తగ్గితే రాష్ట్రం నష్టపోతుందని, దీని ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతింటాయని, రాష్ట్ర అభివృద్ధి ఆగిపోతుందని కిషన్ రెడ్డి అన్నారు. గత బడ్జెట్లో రెవెన్యూ అంచనాలకు, రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులకు ఏమాత్రం సంబంధం లేదని ఈ బడ్జెట్ నిరూపించిందని కిషన్ రెడ్డి తెలిపారు. అమలుకు నోచుకోని హామీలు ఇచ్చి, అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయకుండా తప్పించుకుంటోందని ఆరోపించారు. ప్రజాసంక్షేమాన్ని, రాష్ట్రాభివృద్ధిని విస్మరించిన ఈ బడ్జెట్ను బీజేపీ పూర్తిగా ఖండిస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు.