తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీకి చేరుకున్నారు. రేపు శుక్రవారం ఢిల్లీలో సీఎం రేవంత్ పలు కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆయన ఈ పర్యటన సాగుతోంది.
ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి..
- ఉదయం 11 గంటలకు: తాజ్ ప్యాలెస్ హోటల్లో న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ డి. మర్ఫీతో రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఈ భేటీలో ఇరు ప్రాంతాల మధ్య సహకారం, పెట్టుబడుల అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
- ఉదయం 11:30కు: బిజినెస్ స్టాండర్డ్ ఎడిటర్ నిర్వహించే 12వ వార్షిక ఫోరమ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, ఆర్థికాభివృద్ధి ప్రణాళికలను వివరించనున్నారు.
- మధ్యాహ్నం 12 గంటలకు: అమెజాన్, కార్ల్స్బర్గ్, కార్లైల్, గోద్రెజ్, ఉబెర్ వంటి ప్రముఖ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో ఆయన విడివిడిగా సమావేశమవుతారు. ఈ సమావేశాల్లో తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలపై చర్చలు జరపనున్నారు.
- మధ్యాహ్నం 12:30కు: ముఖ్యమంత్రి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అధ్యక్షుడు, సీఈఓ మరియు నార్వే మాజీ యూనియన్ మంత్రి అయిన బోర్జ్ బ్రెండేతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ సమావేశం తెలంగాణకు అంతర్జాతీయ వేదికపై గుర్తింపు తీసుకొచ్చేందుకు దోహదపడనుంది.









