మైనారిటీ సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా వున్నదని, రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి తన్నీరు హరీశ్ రావు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనిక పాలన, తెలంగాణలో హిందూ ముస్లిం ఐక్యతను పటిష్టం చేస్తూ, గంగా జమునా తహజీబ్ ను కాపాడుతూ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సెక్యులర్ వైఖరి తెలంగాణలో మత సామరస్యాన్ని చాటిచెబుతున్నదన్నారు.
టిఎస్ఐడిసీ చైర్మన్ బిఆర్ఎస్ పార్టీ నేత మహమ్మద్ తన్వీర్ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రేస్ పార్టీకి చెందిన పలువురు ముస్లిం మైనారిటీ నేతలు, కార్యకర్తలు శుక్రవారం మంత్రి తన్నీరు హరీశ్ రావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారిలో.. జహీరాబాద్ పట్టణ కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షులు మహమ్మద్ మొయిస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అక్బర్, మాజీ కౌన్సిలర్ ఫక్రుద్దీన్, వీరితోపాటు వివిధ పార్టీలకు చెందిన 200 మంది ముస్లిం మైనారిటీ నేతలకు మంత్రి తన్నీరు హరీశ్ రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు నరోత్తం, నామ రవికిరణ్, బాసిత్, షాకి వస్తాద్, తాజుద్దీన్, అక్రమ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. మైనారిటీల సంక్షేమం కోసం దేశంలోని ఏ రాష్ట్రమూ తెలంగాణ స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు చేయలేదని వివరించారు. ముస్లిం మైనార్టీల సంఖ్య కోటిన్నర జనాభా ఉన్న మహారాష్ట్రలో బడ్జెట్ లో 674 కోట్లు కేటాయిస్తే, 50 లక్షలు ఉన్న తెలంగాణలో 2,200 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత వీరి సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ పదివేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ముస్లిం మైనారిటీ విద్యార్థుల కోసం 204 పాఠశాలలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యనందిస్తూ ముస్లిం యువతను రేపటి పౌరులుగా తీర్చిదిద్దుతున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని మంత్రి అన్నారు. ఉర్దూ తో పాటు ఇంగ్లీష్ మీడియంలో బోధన జరుపుతూ భవిష్యత్తులో ఉద్యోగ ఉపాధి రంగాల్లో అవకాశాలు దక్కేలా చర్యలు చేపడుతున్నామన్నారు. మైనారిటీల్లోని పేదలకు నిరుద్యోగులు సొంత వ్యాపారాలు నిర్వహించుకోవడానికి లక్ష రూపాయల ఉచిత గ్రాంటును అందచేయబోతున్నామని తెలిపారు. లక్షమంది అర్హులైన వారికి ఈ పథకాన్ని త్వరలోనే దశలవారీగా అమలు చేస్తామన్నారు. షాది ముబారక్ ద్వారా 9 ఏళ్లలో రెండున్నర లక్షల మంది పెళ్లిళ్లకు మొత్తం రూ. 2, 130 కోట్లు ప్రభుత్వం అందించింది అన్నారు.

జహీరాబాద్ పట్టణం బిఆర్ఎస్ పాలనలో మున్నెన్నడూ లేని విధంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. జహీరాబాద్ లో హజ్ హౌజ్ ను షాదీఖానా లను నిర్మిస్తున్నామన్నారు. కబరస్థాన్ కోసం కూడా స్థలాన్ని కేటాయిస్తామన్నారు. ఫరీద్ గారి మరణం తర్వాత తన్వీర్ ను ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా వారికి తగు స్థానాన్ని సిఎం కేసీఆర్ గారు కల్పించారని తెలిపారు. గజ్వేల్, సిద్దిపేట మున్సిపల్ చైర్మన్లను ముస్లింలకే కేటాయించారని తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ముస్లిం మైనారిటీ నాయకత్వాన్ని తగురీతిలో ప్రోత్సహిస్తూ అవకాశమున్న ప్రతిచోటా ప్రాధాన్యతనిస్తున్నారని తెలిపారు.

కర్నాటక మహారాష్ట్ర మణిపూర్ సహా దేశవ్యాప్తంగా హిందూ ముస్లింల నడుమ చిచ్చురేపుతూ బిజెపి ప్రభుత్వం శాంతి భధ్రతల సమస్యను సృష్టిస్తున్నదన్నారు. అదే తెలంగాణలో తొమ్మిదేండ్లల్లో వొక్కటంటే వొక్కటి చిన్న గొడవ కూడా కాకుండా సిఎం కేసీఆర్ పాలన కొనసాగుతున్నదన్నారు. హిందూ ముస్లిం బాయి బాయి అనే ప్రశాంత వాతావరణాన్ని తెలంగాణలో నెలకొన్నదని సిఎం తెలిపారు.
కాంగ్రేస్ పార్టీకి బడుగు బలహీన వర్గాలు మైనారిటీల సంక్షేమం కోసం కాకుండా ముందుగా ఆ పార్టీ నేతలు వారి కుర్చీలను కాపాడుకునేందుకు అధికారం కోసం పాకులాడుతుంటారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారని అదంతా వట్టి పగటి కలేనని స్పష్టం చేశారు. కాంగ్రేస్ పార్టీ పాలన ఎట్లా సాగుతున్నదో.. జహీరాబాద్ ను ఆనుకుని వున్న కర్ణాటక పరిస్థితులను పరిశీలిస్తే అర్థం అవుతుందన్నారు. అక్కడ కరెంటు పరిస్థితి దారుణంగా వున్నదనీ, 8 గంటలు కూడా కరెంటు రావట్లేదని తెలిపారు. అదే తెలంగాణ రాష్ట్రంలో 24 గంటలు నాణ్యమైన కరెంటు అందుబాటులో వుంటున్నదనీ.. తాగునీరు కోసం ఒకకనాడు జహీరాబాద్ ఎంతో గోస పడింది కానీ నేడు ప్రతి ఇంటికీ నల్లాతో నీల్లుందుతున్నాయని హరీశ్ రావు అన్నారు.

రోడ్లు తదితర మౌలిక సదుపాయాలతో సహా జహీరాబాద్ ను సిఎం కేసీఆర్ గొప్పగా అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ఆర్డీవో ఆఫీసును ఏర్పాటు చేయడంతో పాటు, ఎసీపీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను సిఎం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే మహేంద్ర ట్రాక్టర్ల ఫ్యాక్టరీ, ఐస్క్రీ ఫ్యాక్టరీ వంటి పలు పరిశ్రమలు ఏర్పాటయ్యాయని, జహీరా బాద్ యువతకు ఉపాధికల్పించే దిశగా భవిష్యత్తులో మరిన్ని చర్యలు చేపడుతున్నామన్నారు.
షాదీముబారక్, రైతుబంధు వంటి పలు పథకాల ద్వారా ముస్లిం మైనారిటీల కుటుంబాలు లబ్ధిపొందుతున్నాయని తెలిపారు. తెలంగాణ మోడల్ పాలన నేడు దేశవ్యాప్తంగా కావాలని డిమాండు పెరిగిందన్నారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో ముందుకు పోతున్న సిఎం కేసీఆర్ గారికి మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాల్లో అద్భుతమైన ఆదరణ లభిస్తున్నదని తెలిపారు.