Menu

  • Home
  • తెలంగాణ
  • కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వలేదు: హరీష్ రావు
Image

కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వలేదు: హరీష్ రావు

కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం 86 వేల కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని పార్లమెంట్ సాక్షిగా బీజేపీ ఎంపి నిశికాంత్‌ దూబే ప్రకటన చేయడం పట్ల ఆర్థిక, వైద్యారోగ్య శాఖా మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వానిది లేదని స్పష్ట్ం చేశారు. తెలంగాణ ప్రభుత్వం సమకూర్చుకున్న సొంత నిధులతోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేశామని ఆయన తెలిపారు. కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా కాళేశ్వరం ప్రాజెక్టు కోసం నిధులు ఇచ్చామంటూ గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు అని హరీష్ రావు ట్విట్టర్ వేదికగా విమర్శించారు.

ఒక్కరేమో కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఒక్క గుంట భూమి తడవలేదు అంటారు, మరొకరు కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ ప్రభుత్వంకు ఏటీఎం అని అంటారు, కాళేశ్వరంలో అవినీతి జరగలేదని వాళ్ళే సర్టిఫికెట్లు ఇస్తరు. ఇవాళ ఇంకో ఎంపి కాళేశ్వరం ప్రాజెక్టు కు 86 వేల కోట్ల నిధులు మేమే ఇచ్చామని అంటున్నారు. పాముకు రెండు నాలుకలు అయితే, అబద్దాల బీజేపీకి మాత్రం పది నాలుకలు అనీ.. తప్పుడు ప్రచారం చేసి రాజకీయ లబ్ది పొందాలనే నీచమైన ఆలోచన ఆ పార్టీ నాయకులది అని తీవ్ర స్థాయిలో హరీష్ రావు కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.

సీఎం కేసీఆర్ ఆలోచనతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రపంచ స్థాయి గుర్తింపు వస్తే, ఓర్చుకోలేక బీజేపీ ఎంపీలు ఇలా చిల్లర మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. గతంలో సోషల్ మీడియాలోనే అబద్దాలు ప్రచారం చేసే ఈ బీజేపీ నేతలు.. ఇప్పుడు పవిత్రమైన పార్లమెంట్ సాక్షిగా అబద్దాలు కూడా ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. పార్లమెంట్ ను అవమాన పరుస్తూ మాట్లాడ్డం సిగ్గు చేటని అన్నారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు కు జాతీయ హోదా అడిగితే ఇవ్వని కేంద్రం, ఇవాళ నిస్సిగ్గుగా ప్రాజెక్టుకు నిధులు ఇచ్చామని అనడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం అని హరీష్ రావు విమర్శించారు.

Share the post