రాష్ట్రంలో యాసంగి పంట సాగుకు సరిపడ సాగు నీరు అందించాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. సోమవారం డా.బి.ఆర్.అంబేద్కర్ సచివాలయం నుండి అన్ని జిల్లా కలెక్టర్లతో సి.ఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. యాసంగి సీజన్ పంట సాగు, రెసిడెన్షియల్ పాఠశాలల పనితీరు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనకు చేపట్టిన కార్యక్రమాలపై సమీక్షించారు.
యాసంగి పంటలకు నీటి నిర్వహణ సమర్ధవంతంగా జరిగేలా కలెక్టర్లు చాలా అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు. గతేడాదితో పోలిస్తే నికర సాగు విస్తీర్ణం పెరిగినప్పటికీ నీటి వనరులలో నీటి లభ్యత చాలా సౌకర్యంగా ఉందని, యాసంగి సీజన్ను బాగా చూసుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. రాబోయే పది రోజులలో విద్యుత్, నీటి సరఫరాను జాగ్రత్తగా సమన్వయం చేయాలన్నారు. విద్యుత్ సరఫరాలో ప్రస్తుత పరిస్థితి సౌకర్యవంతంగా ఉందని ఆమె తెలిపారు.
జిల్లాలో స్థానిక సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు మండల స్థాయి బృందాలను ఏర్పాటు చేయాలని, క్షేత్ర స్థాయిలో సమర్ధవంతమైన నిర్వహణ ఉండే విధంగా జిల్లా కలెక్టర్లు పర్యేవేక్షించాలని అన్నారు. రాష్ట్రంలో నీటి నిల్వలు, విద్యుత్ సరఫరా తగినంత పరిమాణంలో ఉన్నాయని రైతులకు అవగాహన కల్పించాలని సి.ఎస్ అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లను సీనియర్ అధికారులు సందర్శించిన తర్వాత భోజన, ఇతర మౌలిక సదుపాయాల సమస్యల పరిష్కారంలో సత్ఫలితాలపై సీఎస్ సంతోషం వ్యక్తం చేస్తూ, జిల్లా కలెక్టర్లను అభినందించారు. విద్యార్థులకు మెరుగైన సదుపాయాలను కల్పించేందుకు ఉత్తమ పద్ధతులను ఎంచుకోవాలన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సమయానుకూల కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని కలెక్టర్లను సి.ఎస్ కోరారు