హైదరాబాద్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, రాజేంద్రనగర్, తుర్కయాంజల్, సరూర్నగర్, నాగోల్, చంపాపేట, సైదాబాద్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్రోడ్స్, హిమాయత్ నగర్,అంబర్ పేటలో వాన జల్లులు కురిశాయి. అశోక్నగర్, చిక్కడపల్లి, బాగ్లింగంపల్లి, రాంనగర్, అడిక్మెట్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, తార్నాక, ఓయూ క్యాంపస్, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీనికితోడు వరదనీరు రహదారుల పైకి రావడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారు దుకాణాల వద్ద, మెట్రో పిల్లర్ల కింద తలదాచుకుంటున్నారు. మరోవైపు పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించింది. పనులపై బయటకు వెళ్లినవారు, ఉద్యోగాలకు వెళ్తున్నవారు ట్రాఫిక్లో చిక్కుకుని వానలో తడిసిముద్దవుతున్నారు. రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా ఎండ తీవ్రతతో అల్లాడిన నగర ప్రజలకు ఈరోజు పడిన వర్షానికి కాస్త ఉపశమనం కలిగించింది.