మహిళా సాధికారతకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. WE Hub విమెన్ యాక్సిలరేషన్ ప్రోగ్రాంలో పాల్గొన్న ఆయన మహిళా శక్తిని కొనియాడారు. 1971లో పాకిస్తాన్ తో యుద్ధం జరిగినప్పుడు మరియు చైనాతో యుద్ధం జరిగినప్పుడు ఇందిరా గాంధీ మహిళా శక్తిని ప్రపంచానికి చాటారని గుర్తు చేశారు. దేశాన్ని గెలిపించిన శక్తి మహిళా శక్తి అని, మహిళా శక్తిని కాంగ్రెస్ ఎప్పుడూ తక్కువ అంచనా వేయలేదని ఆయన అన్నారు. దేశానికి మహిళలు ఆదర్శమని, మహిళా శక్తి దేశానికి అండ అని నిరూపించిన ఘనత కాంగ్రెస్ దేనని ఆయన అన్నారు.
మహిళా సాధికారతకు అనేక కార్యక్రమాలు
రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తికి చేయూతనిచ్చే అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన తెలిపారు. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి మహిళలకు సోనియమ్మ నజరానా అందించారని, మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ లాభాల బాటలో నడుస్తోందని ఆయన అన్నారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణను అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో ఆడబిడ్డలకు అప్పగించామని, విద్యార్థుల యునిఫార్మ్ కుట్టుపనిని మహిళా సంఘాలకు అప్పగించి వారికి భరోసా అందించామని ఆయన వెల్లడించారు.

వ్యాపారంలో మహిళలను ప్రోత్సహిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పెట్రోల్ బంకులు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి వ్యాపారాలను చేసేందుకు మహిళా సంఘాలను ప్రోత్సహిస్తున్నామని, అదానీ, అంబానీలకు పరిమితమైన వ్యాపారాలను మహిళలు చేసేలా ప్రోత్సహిస్తున్నామని ఆయన అన్నారు. శిల్పారామంలో స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల ప్రదర్శనకు స్టాల్స్ ను కేటాయించామని, ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో నిలబడినప్పుడే రాష్ట్రం ఆర్థికంగా పురోగతి సాధిస్తుందని తాము నమ్ముతున్నామని ఆయన అన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యుల సంఖ్యను కోటికి పెంచుకోవాలని ఆయన కోరారు. మీ రేవంతన్నగా మీకు ప్రోత్సాహం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.

Also Read…| ఆదంపూర్ ఎయిర్ బేస్ కు ప్రధాని నరేంద్ర మోడీ
దేశంలో 16 లక్షల కోట్లు కార్పొరేట్ కంపెనీలకు అప్పు ఇస్తే ఎగ్గొట్టి దేశం విడిచి వెళ్లారని, కానీ ఆడబిడ్డలకు అప్పు ఇస్తే.. ఒక్క రూపాయి ఎగ్గొట్టకుండా వడ్డీతో సహా చెల్లిస్తున్నారని ఆయన అన్నారు. ఆర్ధిక క్రమశిక్షణ మా ఆడబిడ్డల సొంతమని ఆయన తెలిపారు. ఇప్పటికే వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి వ్యాపారాన్ని మహిళలకు అప్పగించామని, మీరు సమర్ధవంతంగా నిర్వహిస్తే అవసరమైతే మరో వెయ్యి మెగావాట్ల సోలార్విద్యుత్ ఉత్పత్తి వ్యాపారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు ఉత్పత్తి చేసిన వాటినే రాష్ట్రానికి వచ్చే అతిథులకు బహుమతులుగా అందిస్తున్నామని, మా ఆడబిడ్డలను ప్రోత్సహించడమే మా ప్రభుత్వ విధానమని ఆయన అన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న మహిళలను స్వయం సహాయక సంఘాలలో చేర్చేందుకు ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశిస్తున్నానని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే మా ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
