కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్లో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియా చిట్ చాట్ నిర్వహించారు. హెచ్సీయూ విద్యార్థులు, ఉపాధ్యాయులను కొందరు రెచ్చగొడుతున్నారని, వారికి ఆ భూములపై ఎలాంటి హక్కు లేదని వారికి కూడా తెలుసని ఆయన అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ఈ భూముల విషయంలో కుట్రకు తెరలేపాయని ఆయన ఆరోపించారు.
రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నసన్నిబియ్యం పంపిణీ మరియు రాజీవ్ యువ వికాసం వంటి ముఖ్యమైన అంశాలపై చర్చ జరగకుండా అడ్డుకునేందుకు ఒక పెద్ద కుట్ర జరుగుతోందని కిరణ్ కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కొంతమందిని రాష్ట్ర నేతలు పట్టించుకోవడం లేదని తప్పుడు వీడియోలతో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్లకు సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తున్నారని ఆయన తెలిపారు.
ప్రభుత్వాన్ని మానసికంగా ఇబ్బంది పెట్టాలనేది బీజేపీ మరియు బీఆర్ఎస్ యొక్క కుట్రపూరిత ఎత్తుగడ అని ఎంపీ విమర్శించారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో రాష్ట్ర ఇంచార్జి మీనాక్షి నటరాజన్ మాట్లాడని విషయాలను కొన్ని పత్రికలు రాశాయని ఆయన ఖండించారు. ఊహాగానాలను వాస్తవ వార్తలుగా రాయడం సరైనది కాదని ఆయన హితవు పలికారు.
కంచ గచ్చిబౌలి భూములు కేంద్రంలో బీజేపీ ఉన్నప్పుడే లీజుకు: ఎంపీ చామల
కేంద్రంలో బీజేపీ మరియు రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే కంచ గచ్చిబౌలి భూములను ఐఎంజీకి లీజుకు ఇచ్చారని కిరణ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. బిల్లీ రావుతో ఒప్పందం లేకపోతే గత పదేళ్లుగా 400 ఎకరాల భూమిపై బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు పోరాటం చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఈ సమస్యపై హెచ్సీయూ విద్యార్థులకు సరైన అవగాహన లేదని, ప్రతిపక్షాల కుట్రలో వారు పావులుగా మారారని ఆయన అభిప్రాయపడ్డారు.
Also Raed…| AP Cabinet: ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
కంచ గచ్చిబౌలి వివాదంపై ముఖ్యమంత్రి కానీ లేదా మంత్రి శ్రీధర్ బాబు కానీ ఏదైనా వ్యాఖ్యానిస్తేనే అది ప్రభుత్వ నిర్ణయంగా పరిగణించబడుతుందని ఆయన స్పష్టం చేశారు. హెచ్యూసీ తరలింపు అనేది కేవలం ఊహాగానం మాత్రమేనని ఆయన కొట్టిపారేశారు. ప్రైవేటు కంపెనీకి కేటాయించిన భూమిని తిరిగి తీసుకుని అభివృద్ధి చేస్తామంటే ఎవరికి ఇబ్బంది అని ఆయన ప్రశ్నించారు.