తెలంగాణ ప్రాంత ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా గడచిన పది సంవత్సరాలలో పేదల ఇండ్ల నిర్మాణం జరగలేదని.. దీంతో ఇండ్ల నిర్మాణానికి ప్రజల నుంచి భారీ ఎత్తున డిమాండ్ ఉందని.. దీనిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన ఇండ్లను మంజూరు చేయాలలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఒకరోజు రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో మంత్రి పొంగు లేటి ఆయనకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఇద్దరు మంత్రులు కలిసి కరీంనగర్ వెళ్లారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత జరిగిన సమావేశంలో కూడా మంత్రి పొంగు లేటి హౌసింగ్ కు సంబంధించి పలు అంశాలను ఆయన వద్ద ప్రస్తావించారు.
గత ప్రభుత్వం గృహనిర్మాణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, హౌసింగ్ విభాగాన్ని నిర్వీర్యం చేసిందని మంత్రి అన్నారు. ఉద్యోగులను ఇతర శాఖలలో సర్ధుబాటు చేసి, ఈ పరిస్ధితులలో ఏడాది క్రితం అధికారంలోకి వచ్చిన తమ ప్రభుత్వం పేదల ఇండ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. వచ్చే నాలుగు సంవత్సరాలలో 20 లక్షల ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ఇందుకోసం గృహ నిర్మాణ శాఖను పునరుద్ధరించి, అవసరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు.
ఇండ్లు లేని వ్యక్తులు సుమారు 44 లక్షలు
ఇటీవలి సర్వే ప్రకారం తెలంగాణలో అర్హులైన ఇండ్లు లేని వ్యక్తులు 44 లక్షల మంది ఉన్నారని అన్నారు. బ్దిదారుల అర్హత, జియో ట్యాగింగ్, వారి ప్రస్తుత నివాసం వంటి విషయాలను డాక్యుమెంటేషన్ కోసం ప్రత్యేక మొబైల్ యాప్ను రూపొందించామని తెలిపారు. దీనితో ఇంటింటి సర్వే నిర్వహించి, 360 డిగ్రీ టూల్తో డెస్క్ వెరిఫికేషన్ జరిగిందని అన్నరు. తుది జాబితాల రూపకల్పన కోసం గ్రామ సభలు నిర్వహించామన్నారు.
తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో వేగవంతమైన పట్టణీకరణ జరుగుతుందని మంత్రి పొంగులేటి అన్నారు. 26 జిల్లాలలోని 6867 గ్రామాలను ఇటీవల యూడిఎ కిందికి తీసుకు రావడం జరిగిందని వివరించారు. వీటిని కేంద్ర ప్రభుత్వ పోర్టల్ లో చేర్చాలని అన్నారు.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పేజ్ -1 ప్రకారం దేశ వ్యాప్తంగా రెండు కోట్ల ఇండ్లు మంజూరుకాగా తెలంగాణకు 1.58 లక్షల ఇండ్లు మాత్రమే మంజూరయ్యాయని.. ఇది దేశం మొత్తం మంజూరులో కేవలం 0.79 శాతం మాత్రమే అని అన్నారు.
దేశ పట్టణ జనాభాలో తెలంగాణ 8 శాతం ఉందని అన్నారు. ఈ నేపధ్యంలో తెలంగాణ రాష్ట్రం మరో 24 లక్షల ఇండ్లను పొందడానికి అర్హత కలిగి ఉందని అన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ పధకం (2.0) కింద కనీసం 20 లక్షల ఇండ్లు మంజూరు చేయాలని కేంద్రమంత్రిని పొంగులేటి కోరారు.