రాష్ట్రంలో ఉన్న అన్ని బీసీ , ఎస్సి, ఎస్టీ , మైనారిటీ గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖామంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు అధికంగా వస్తున్న నేపథ్యంలో గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి గురుకుల పాఠశాలలో వాటర్ ట్యాంకులు శుభ్రం చేసి, తాగునీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అస్వస్థతగా ఉన్న విద్యార్థులకు ఏఎన్ఎం పర్యవేక్షణలో చికిత్స అందించాలని అధికారులకు సూచించారు. పిల్లల హైట్, వెయిట్ రికార్డు చేయాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన మంచి పోషకాహారం అందించాలని.. ఆహారం వండేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. పరిసరాల శుభ్రత, తరగతి గది, హాస్టల్ గది శుభ్రతపై పిల్లలకి అవగాహన కల్పించాలని అన్నారు. పిల్లలకు హిమోగ్లోబిన్, విటమిన్-డి లాంటి పరీక్షలు నిర్వహించాలన్నారు. పాఠశాలలో ఆవరణలో శుభ్రంగా ఉంచాలని గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ లను ఆదేశించారు. ఇటీవల జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దపూర్ సాంఘిక సంక్షేమ పాఠశాలలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని , జిల్లాలో ఉన్న గురుకుల పాఠశాలలను పర్యవేక్షించాలని అధికారులకు మంత్రి సూచించారు.