డప్పు చప్పుళ్లు.. కోయల నృత్యాలు.. భక్తుల జయజయ ధ్వానాల నడుమ సారలమ్మ మేడారం గద్దె పైకి బుధవారం చేరుకుంది. ఫలితంగా మేడారం మహా జాతర లాంఛనంగా ప్రారంభమైంది.
సారలమ్మను గద్దెకు తీసుకొచ్చే కార్యక్రమం బుధవారం ఉదయం ఆమె వెలసిన కన్నెపల్లి ఆలయం నుంచే ఆర్భాటంగా మొదలైంది. ఆలయాన్ని శుద్ధి చేసి.. ముగ్గులతో అలంకరించిన అనంతరం ఆదివాసీ పూజారులు సాయంత్రం ఏడు గంటల దాకా ప్రత్యేక పూజలు చేశారు. సారలమ్మ తల్లి రూపంలో ఆలయం నుంచి బయటకు వచ్చిన పూజారి సారయ్య.. భక్తుల మొక్కుల సమర్పణ నడుమ మేడారం దిశగా కదిలారు. కన్నెపల్లి నుంచి రెండు కిలోమీటర్ల దూరం దారి పొడవునా భక్తులు బారులు తీరి హారతులిచ్చారు.
రాత్రి 12.11 గంటలకు సారలమ్మ గద్దెకు చేరుకుంది. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజును కూడా గద్దెల పైకి చేర్చారు. అంతకుముందు పగిడిద్దరాజు-సమ్మక్క కల్యాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక మేడారం జాతర రెండో రోజు మరింత ప్రత్యేకం.. సారలమ్మ గద్దెకు చేరుకోగా సమ్మక్క గురువారం గద్దె పైకి రానుంది. సమ్మక్క ఆగమనం కోసం ఉదయమే ఏర్పాట్లు మొదలవుతాయి. తొలుత మేడారం లోని సమ్మక్క గుడిని శుద్ధి చేస్తారు.
మామిడి తోరణాలు కడతారు. శక్తి పీఠాన్ని ఎర్ర మన్నుతో అలికి ముగ్గులు వేస్తారు. పూజారులు అడవికి వెళ్లి వెదురు వనం, అడెరాలు తెచ్చి గద్దెపై నిలుపుతారు. ఆడెరాలను పసుపు, కుంకుమతో అలంకరిస్తారు. సాయంత్రం ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య నేతృత్వంలో పూజారుల బృందం చిలుకల గుట్ట సమీపం లోకి వెళతారు. అక్కడి నుంచి గుట్ట పైకి ప్రధాన పూజారి ఒక్కరే వెళతారు. అక్కడ ఉన్న సమక్క రూపమైన కుంకుమ భరిణ, ఇతర పూజా సామగ్రిని శుద్ధి చేసి కృష్ణయ్య ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.
ఈ పూజా తంతు అంతా గోప్యంగా జరుగుతుంది. ఆ తర్వాత పూజారి తల్లి స్వరూపాన్ని తీసుకొని కిందకు వస్తున్నట్టు సంకేతం ఇస్తారు. తల్లిని తీసుకొని ఆయన కిందకు దిగ గానే అక్కడ మంత్రులు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు.. సమ్మక్కకు స్వాగతం పలుకుతారు. సమ్మక్క తల్లికి గౌరవ సూచకంగా ఎస్పీ గాల్లో మూడు రౌండ్లు తుపాకీని పేల్చుతారు. గుట్టపై నుంచి సమ్మక్క కిందకు ఏతెంచే వరకు గుట్ట కింద ఆదివాసీ కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇస్తారు. డోలు వాయిద్యాలతో నృత్యాలు చేస్తారు. ఆట పాటలతో అలరిస్తారు.
పూజారులు సమ్మక్క తల్లితో కిందకు దిగిన తర్వాత అత్యంత వేగంగా మేడారం గద్దె వైపు కదులుతారు. దారి పొడవునా భక్తులు బారులు తీరి నిల్చుంటారు. మంగళ హారతులు పడతారు. కోళ్లు, గొర్రెలను బలిస్తారు. వీలైనంత మేరకు రాత్రి 9-10 గంటల మధ్య సమ్మక్కను గద్దె పైకి పూజారులు తీసుకు వచ్చేలా జిల్లా యంత్రాంగం ప్రయత్నాలు చేస్తోంది. సమ్మక్క గద్దె పైకి చేరుకోవడంతో జాతర మరో స్థాయికి చేరుతుంది.