వరంగల్ పట్టణాన్ని మరో నగరంగా తీర్చిదిద్దడానికి మాస్టర్ ప్లాన్ తక్షణమే సిద్ధం చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం రోజున డా. బి.ఆర్. అంబేద్కర్ సచివాలయం లో తన కార్యాలయంలో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) అధికారులు, సంబంధిత శాఖల అధికారులతో వరంగల్ నగర అభివృద్ధి పై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్ నగరం తర్వాత వరంగల్ పట్టణాన్ని విస్తృత పరచడానికి, పలు అభివృద్ధి పనులు చేపట్టాడానికి తగు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసేందుకు గతంలో సమావేశాలు నిర్వహించడం జరిగిందని మంత్రి తెలిపారు. గతంలో ఉన్న 2041 మాస్టర్ ప్లాన్ ను 2050 నాటి జనాభాను దృష్టిలో ఉంచుకొని పట్టణంలో అభివృద్ధి పనులు చేపట్టుటకు ప్రతిపాదనలు రూపొందించాలని ఆయన సూచించారు. ఇందుకు అవసరమైన భూముల సేకరణ చేపట్టాలని ఆయన అన్నారు. ఇప్పటి వరకు కన్సల్టెంట్లు తయారు చేసిన మాస్టర్ ప్లాన్ లను మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పరిశీలించి, పలు సూచనలు చేశారు.