ఉత్కంఠ వీడింది… విజేత ఎవరో తేలింది.. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరు గ్రామంలో సర్పంచ్ గా విజేతను అధికారులు ప్రకటించారు. మేజర్ గ్రామ పంచాయతీ ఆకునూరులో కాంగ్రెస్ పార్టీ మద్దతుతోకొమ్మురవి 861 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే మేజర్ గ్రామ పంచాయతీ అయిన ఆకునూరులో ఈసారి కనీవినీ ఎరుగని రీతిలో ఎన్నికలు జరిగాయి. సర్పంచ్ పదవికి జెనరల్ రిజర్వేషన్ రావడంతో బరిలో 11 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. చివరిక్షణం వరకు అభ్యర్థులు తమ గెలుపుకు ప్రయత్నాలు చేశారు. చివరగా ఆకునూరు ఓటర్లు కొమ్మురవికి అండగా నిలిచి విజయం కట్టబెట్టారు.
ఆకునూరు ప్రజలకు రుణపడిఉంటా : కొమ్మురవి
తనపై నమ్మకం ఉంచి సర్పంచ్ గా గెలిపించిన ఆకునూరు గ్రామస్థులకు కొమ్మురవి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించారని అన్నారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, జనగామ నియోజకవర్గ ఇంచార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డిల మద్దతుతో ఆకునూరు గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ఆయన తెలిపారు. తన గెలుపుకు కృషిచేసిన ప్రతీ ఒక్క కార్యకర్తకు, నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
సర్పంచ్ పదవికి 20 సంవత్సరాల నిరీక్షణ !
కొమ్మురవి గతంలో 2006 లో ఆకునూరు సర్పంచ్ గా పోటీచేసి ఓటమిపాలయ్యారు. అప్పటినుండి కాంగ్రెస్ పార్టీలోనే అంచెలంచెలుగా ఎదిగారు. ప్రస్తుతం చేర్యాల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షునిగా ఆయన కొనసాగుతున్నారు. దాదాపు 20 సంవత్సరాల తర్వాత సర్పంచ్ గా గెలిచి, పుట్టిన ఊరుకు సేవచేయాలనే ఆయన లక్ష్యం నెరవేరిందని పలువురు గ్రామస్థులు చర్చించుకుంటున్నారు.









