Sunday, May 18, 2025
HomeNewsTelanganaBRS PARTY: పార్టీ ప్రక్షాళనకు సిద్దమవుతున్న గులాబీ బాస్ !

BRS PARTY: పార్టీ ప్రక్షాళనకు సిద్దమవుతున్న గులాబీ బాస్ !

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు ఎనిమిది నెలలు పూర్తయ్యాయి. పదేళ్లపాటు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి ఇప్పుడు ప్రతిపక్షంలోకి మారిపోయింది. ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోవడంతో గులాబీ శ్రేణుల్లో నిరాశ నెలకొని ఉంది. ఈ పరిస్థితి దృష్ట్యా, కేసీఆర్ పార్టీ ప్రక్షాళనకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారని సమాచారం.

ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది?

ఎంపీ ఎన్నికల తరువాత గులాబీ పార్టీ పరిస్థితిని అంచనా వేసిన కేసీఆర్, గ్రామ స్థాయినుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్నారు. పూర్తి స్థాయి కమిటీలు లేకపోవడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని, మొదటి నుంచి పని చేసిన వారికి బాధ్యతలు అప్పగించాలని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ అనుబంధ కమిటీలను కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి, క్యాడర్‌ను యాక్టివేట్ చేయాలని పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారు. దీకికి సంబందించి క్యాడర్‌కు శిక్షణ ఇచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఉంచే ప్రణాళికలు రచిస్తున్నారు.

జిల్లా స్థాయిలో బలమైన నేతలను గుర్తించి, బాధ్యతలు అప్పగించేందుకు గులాబీ పార్టీ కసరత్తు చేస్తోంది. 2022 జూన్ లో, బీఆర్ఎస్ పార్టీ జిల్లా కమిటీలను ప్రకటించింది. అయితే, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో అధ్యక్షులు పార్టీ మారడంతో ఆయా స్థానాలు ఖాళీ అయ్యాయి. 19 జిల్లాల్లో పూర్తి స్థాయి కమిటీలను నియమించలేదు. ఎమ్మెల్యేలకు జిల్లాల్లో అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంతో, సీనియర్ నాయకులు, ఉద్యమకారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆరేళ్ల క్రితం 69 మంది సభ్యులతో రాష్ట్ర కమిటీని ప్రకటించిన విషయం తెలిసిందే. కొంతమంది పార్టీ మారడంతో, రాష్ట్ర కమిటీపై అధిష్టానం తక్కువ దృష్టి పెట్టింది. సీనియర్ నేతలకు అవకాశాలు కల్పించలేదని, అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్ర కమిటీ సమావేశం ఇప్పటివరకు జరగలేదని పార్టీలో చర్చ నడుస్తోంది.

సమావేశాల పేరుతో, రాష్ట్ర కమిటీ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లను పిలిచి సమావేశాలు నిర్వహిస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీకి మొదటినుండి ఉన్న క్యాడర్‌ను కాపాడటానికి, కేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అన్ని జిల్లాల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. శిక్షణా కార్యక్రమాలతో పాటు, జిల్లా కేంద్రాల్లో మీడియా సమావేశాలు నిర్వహించి, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన కార్యక్రమాల్లో కేటీఆర్ ప్రత్యక్షంగా పాల్గొనాలని ప్రణాళికలు వేస్తున్నారు. రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వచ్చినా, అగ్రనేతలను కలిసే అవకాశం లేకపోవడం వల్ల కార్యకర్తలు అసంతృప్తి చెందుతున్నారు. వారి సమస్యలను నియోజకవర్గ, జిల్లా స్థాయిలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని చర్చ జరుగుతోంది.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, సంస్థాగతంగా పార్టీ బలంగా ఉంటేనే అధికార పార్టీని కట్టడి చేయగలమని గులాబీ పార్టీ నమ్ముతోంది. అందుకోసం సమర్ధమైన నేతలకు పార్టీ పదవులు అప్పగించాలని నాయకత్వం భావిస్తోంది. సంస్థాగత నిర్మాణం, కమిటీల పునర్నిర్మాణం బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకువస్తుందా.? లేదా..? అనేది తెలియాలంటే వేచి చూడవలసిందే.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments