కర్ణాటకలో ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నదని, అవసరం అనుకుంటే కెసిఆర్ స్వయంగా వచ్చి పేద ప్రజలను అడిగి తెలుసుకోవచ్చని కర్ణాటక యాద్గిర్ నియోజకవర్గ ఎమ్మెల్యే చన్నారెడ్డి పాటిల్ అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జనంపల్లి అనిరుద్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా జడ్చర్లకు విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు.
ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసి చూపించడం కాంగ్రెస్ లక్షణం అని అన్నారు . కాంగ్రెస్ పాలనలో కర్ణాటక ప్రజలు ఆనందంగా ఉన్నారని.. కర్ణాటకలో అమలవుతున్న సంక్షేమ పథకాల అమలుపై బిఆర్ఎస్ నాయకులు గాలి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పక్క రాష్ట్రం నుంచి కరెంటు కొనుగోలు చేసి నాణ్యమైన 12 గంటల విద్యుత్తు అందిస్తున్నామన్నారు . ఉచిత బస్ సౌకర్యం పథకం అక్కడ మహిళలు బ్రహ్మాండంగా వినియోగించుకుంటున్నారని, మహిళలు పుణ్యక్షేత్రాలను సైతం దర్శించుకుంటున్నారని అన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రం కర్ణాటక ప్రభుత్వంపై ఉల్టా ప్రచారం చేస్తున్నారని అన్నారు. తమ గెలుపు కోసం ఇతరులను బద్నాం చేసే పద్ధతి మంచిది కాదని, నిజంగా ప్రజలు మిమ్మల్ని ఆదరించాలంటే మీరేం చేయబోతున్నారో చెప్పుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు హితువు పలికారు. తన సర్వే ప్రకారం పథకాల అమలులో తెలంగాణ ప్రభుత్వం ఫెయిల్ అయిందన్నారు . డబల్ బెడ్ రూములు ఎవరికి ఇచ్చింది లేదన్నారు. పట్టణాల్లో, గ్రామాలలో కనీస సౌకర్యాలు సైతం కల్పించలేదన్నారు. ప్రాజెక్టుల పేరుతో అవినీతికి పాల్పడిందన్నారు. తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉండి ఏమి చేయలేదని విమర్శించారు. తెలంగాణలో తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఆరు పథకాలను అమలు చేసి చూపిస్తామని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని, జడ్చర్ల ఎమ్మెల్యేగా జనంపల్లి అనిరుద్ రెడ్డి వారి మెజారిటీతో గెలుస్తున్నారని అన్నారు.
అనంతరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జనంపల్లి అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ కర్ణాటకలో ఐదు గ్యారెంటీలు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ, 100 శాతం అక్కడ అమలు చేస్తుందని, తెలంగాణలో సైతం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. జడ్చర్లలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కారణంగా పట్టణంలో టూ లెట్ బోర్డ్ లు వెలుస్తున్నాయని, సెజ్ ఉద్యోగులు మహబూబ్నగర్ వెళ్తుండటంతో అద్దెకు వచ్చే వాళ్ళు లేక ఇల్లు కట్టిన వాళ్ళు అప్పుల పాలు అవుతున్నారని అన్నారు. తప్పని పరిస్థితుల్లో ఇండ్లను అమ్ముకుంటున్నారని అన్నారు. డిసెంబర్ 3 తర్వాత ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఇంటికి సైతం టూ లెట్ బోర్డ్ పెట్టిస్తామని ఎద్దేవా చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ దౌర్జన్యంగా మహబూబ్నగర్ తరలించిన సెజ్ బస్సులను జడ్చర్లకు తిరిగి వచ్చేలా చేస్తామని అన్నారు. అంతకు ముందు వారు జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో పర్యటించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఇంటింటి ప్రచార నిర్వహించారు. మీరు వెంట స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.