దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఓటు మాత్రమేనని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర నాయకులు అందె బీరన్న అన్నారు. డబ్బుకు, మధ్యానికి ఓటు అమ్ముకోవద్దని తెలిపారు. సరైన నేతలను ఎన్నుకుని నవ సమాజ స్థాపనకు కృషి చేయాలని అన్నారు. ఓటు హక్కు అత్యంత విలువైనదని.. దానినిని అభివృద్ధి చేసే నాయకులను ఎన్నుకోవడానికి మాత్రమే వాడాలని పిలుపునిచ్చారు.
బుధవారం నాడు పార్టీ కార్యాలయంలో పాకాల ఎస్సాకు అధ్యక్షతన ఏర్పాటుచేసిన కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు అందె బీరన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష, అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ప్రకారం ఓటు హక్కు కల్పించడం జరిగిందని అన్నారు. జనగామ ప్రాంత అభివృద్ధికి ఓటు వెయ్యాలని, నిరంతరం ప్రజలలో వుండే నాయకుడిని గెలిపించలని అన్నారు. ఇప్పటి వరకూ జనగామ జిల్లా అభివృద్ధికి నోచుకోలేదని, పేద ప్రజల పక్షాన నిలబడి కొట్లాడే నాయకుడుని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమలో అఖిల భారత విద్యార్ధి బ్లాక్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు, ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు ఎర్రోళ్ల అఖిల్, ఆనందం, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
