Menu

  • Home
  • తెలంగాణ
  • CM Revanth Reddy: రైతు రుణమాఫీ ఒకేసారి చేసి తీరుతాం.. త్వరలోనే విధివిధానాలు: సీఎం రేవంత్ రెడ్డి
Image

CM Revanth Reddy: రైతు రుణమాఫీ ఒకేసారి చేసి తీరుతాం.. త్వరలోనే విధివిధానాలు: సీఎం రేవంత్ రెడ్డి

వరంగల్ రైతు డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ పై ఈరోజు క్యాబినెట్ భేటీలో చర్చించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. వ్యవసాయాన్ని పండుగ చేయాలన్నదే కాంగ్రెస్ పార్టీ విధానమని ఆయన స్పష్టం చేశారు. మాట ఇస్తే మడమ తిప్పని నాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే అని రేవంత్ రెడ్డి మరోసారి పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే అది శిలా శాసనం అని అన్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం పదేళ్లలో చేసింది కేవలం 28 వేల కోట్ల రుణమాఫీ మాత్రమే. గత ప్రభుత్వం డిసెంబర్ 11 2018 వరకు కటాఫ్ తేదీగా రుణమాఫీ చేసింది. 2018 డిసెంబర్ 12 నుండి 9 డిసెంబర్ 2023 మధ్యకాలంలో రుణాలు తీసుకున్న రైతులకు ఈ రుణమాఫీ వర్తిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రుణమాఫీకి దాదాపు 31 వేల కోట్లు అవసరం అవుతుందని ఆయన అన్నారు. రైతు రుణమాఫీ కోసం త్వరలోనే నియమా నిబంధనలకు సంబంధించి జీవో విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

రైతు భరోసాపై మంత్రివర్గ ఉపసంఘం

రైతు భరోసా అములులో నియమ నిబంధనలకోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు తుమ్మల శ్రీధర్ బాబు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభ్యులుగా ఈ కేబినెట్ సబ్ కమిటీ జూలై 15లోగా ప్రభుత్వానికి నివేదిక అందిస్తుందని సీఎం తెలిపారు. ఈ నివేదికను శాసనసభలో పెట్టి సభ్యులందరికీ సూచనలతో రైతు భరోసాను అమలు చేస్తామని ముఖ్యమంత్రి అన్నారు.

Share the post