తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన కు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా డిసెంబర్ 1 నుండి 6 వరకు ఈ పర్యటనలు జరగనున్నాయి. ఈ ఆరు రోజుల షెడ్యూల్లో ప్రతిరోజూ ఒక జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. డిసెంబర్ 8, 9 తేదీలలో హైదరాబాద్లో జరగబోయే ప్రతిష్టాత్మక ‘గ్లోబల్ సమిట్’కు ముందు, ఈ పర్యటన పూర్తిచేసేలాగా కార్యాచరణను రూపొందించారు.
సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన షెడ్యూల్
డిసెంబర్ 1న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని మక్తల్ మున్సిపాలిటీ నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది. తరువాతి రోజు, డిసెంబర్ 2న, ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెంలో సభ ఉంటుంది. డిసెంబర్ 3న కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్లో, డిసెంబర్ 4న ఆదిలాబాద్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 5న వరంగల్ జిల్లాలోని నర్సంపేట టౌన్లో, చివరి రోజు డిసెంబర్ 6న నల్గొండ జిల్లా దేవరకొండ మున్సిపాలిటీలో పర్యటన ముగుస్తుంది. ఈ ప్రాంతాలలో ప్రభుత్వ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడంతోపాటు, సంక్షేమ పథకాల అమలు తీరును ముఖ్యమంత్రి (CM Revanth Reddy) క్షేత్రస్థాయిలో పర్యవేక్షించనున్నారు.
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రారంభోత్సవాలు
ఈ పర్యటన కేవలం బహిరంగ సభలకే పరిమితం కాకుండా, పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు వేదిక కానుంది. డిసెంబర్ 1న మక్తల్లో ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్’కు భూమి పూజ చేయనున్నారు. డిసెంబర్ 2న కొత్తగూడెంలో ‘డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ’ని ప్రారంభించనున్నారు. అలాగే, డిసెంబర్ 3న హుస్నాబాద్లో కొత్త ఇంజనీరింగ్ కళాశాల భవనాలకు, హెచ్ఏఎం పద్ధతిలో నిర్మించనున్న రోడ్లకు సీఎం శంకుస్థాపన చేస్తారు. డిసెంబర్ 6న దేవరకొండ సభలో, ఫ్లోరైడ్ రహిత నల్గొండలో పట్టణ తాగునీటి సరఫరా మరియు ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల పురోగతిని ప్రజలకు వివరించనున్నారు.
Also Read..| హైదరాబాద్లో చారిత్రక నాణేల సదస్సు
ఎన్నికల కోడ్ కారణంగా పట్టణ ప్రాంతాలకే పరిమితం
ప్రస్తుతం రాష్ట్రంలో పంచాయతీలకు సంబంధించి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున, సీఎం పర్యటన ప్రాంతాల ఎంపికలో వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. కోడ్ పరిధి లేని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పట్టణ కేంద్రాలను మాత్రమే సభా వేదికలుగా ఖరారు చేశారు. ఈ పట్టణ ప్రాంతాల ద్వారానే ప్రభుత్వం అమలు చేసిన గ్యారెంటీలు, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు వంటి కీలక పథకాల అమలు తీరును ప్రజలకు వివరించనున్నారు.
డిసెంబర్ 1న మహబూబ్ నగర్ జిల్లా మక్తల్
డిసెంబర్ 2న ఖమ్మం జిల్లా కొత్తగూడెం
డిసెంబర్ 3న కరీంనగర్ జిల్లా హుస్నాబాద్
డిసెంబర్ 4న ఆదిలాబాద్
డిసెంబర్ 5న నర్సంపేట
డిసెంబర్ 6న నల్గొండ జిల్లా దేవరకొండ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన ద్వారా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాలని రాష్ట్ర నాయకత్వం చూస్తోంది. రాష్ట్ర స్థాయి నాయకత్వం అంతా ఒకే వేదికపైకి రావడం ద్వారా, ప్రభుత్వంలో, పార్టీలో నెలకొన్న ఐక్యతను తెలియజేయనున్నారు. ఈ బహిరంగ సభల ద్వారా లబ్ధిదారులతో నేరుగా సంభాషించి, ప్రజల నుంచి అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. డిసెంబర్ 1 నుంచి 6 వరకు పర్యటనలు, సభలు నిర్వహించిన తర్వాత, డిసెంబర్ 7న విరామం తీసుకుని, డిసెంబర్ 8 నుంచి గ్లోబల్ సమిట్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు.









