బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని శాసనసభ నుంచి ప్రభుత్వం సస్పెండ్ చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఆదిలాబాద్ టూ ఆలంపూర్ తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మలను కాలబెట్టారు. జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ అప్రజాస్వామికం అన్నారు. ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న బీఆర్ఎస్ గొంతు నొక్కేందుకే సిఎం రేవంత్ రెడ్డి సస్సెన్షన్లను ఆయుధంగా మలుచుకున్నారని మండిపడ్డారు.
Also Read.. | హరీష్ రావుకు హైడ్రా బాధితుల హోళీ శుభాకాంక్షలు
ప్రజాస్వామ్య విలువలకు ప్రతిరూపమైన అసెంబ్లీని నియంతృత్వ పోకడలతో భ్రష్టుపట్టించారని విరుచుకుపడ్డారు. అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా చెప్పుకోవడానికి ఒక్క మంచి పని కూడా చెయ్యని రేవంత్ రెడ్డి, తన చేతకానితనం బయటపడొద్దనే అసెంబ్లీలో బీఆర్ఎస్ నాయకులపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో తమ గొంతు నొక్కితే ప్రజా కోర్టులో తేల్చుకుంటామన్నారు.
బీఆర్ఎస్ నిరసనలు
పార్టీ పిలుపు మేరకు తెలంగాణ గ్రామ గ్రామాన ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిన కార్యకర్తలు, నాయకులకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలను, హామీల అమలు మోసాన్ని ఇదే స్ఫూర్తితో ఎప్పటికప్పుడు ఎండగడదామని పిలుపునిచ్చారు.