రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల 15వ తేదీ తర్వాత జీతాలు ఇచ్చే స్థితిలోకి గత పాలకులు నెట్టివేస్తే, ఒకటవ తేదిన జీతాలు ఇచ్చే స్థితికి ఈ రాష్ట్రాన్ని తీసుకువచ్చి రాష్ట్ర అభివృద్ధి కోసం రోజుకు 18 గంటల పాటు పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వం పాలకులపై రాష్ట్రాన్నిఆర్థిక విధ్వంసం చేసి అధోగతి పాలు చేసిన వారు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ లో 92 మంది అభ్యర్థులకు జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ గా, తెలంగాణ విద్యుత్ సరఫరా సంస్థలో 20 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అందజేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో అరగ్యారంటీ కూడ అమలు చేయలేదని, అబద్ధాల మీద పుట్టిన రాజకీయ పార్టీ గత పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ప్రజలకు భ్రమలు కల్పించి బతికిందని, ఇప్పుడు మళ్లీ అవే అబద్దాలతో ప్రజా ప్రభుత్వం పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు.

కొలువుల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలోనిరుద్యోగుల ఆశలను అడియాసలు చేసి ఉద్యోగాలు ఇవ్వకుండా గత పాలకులు గాలికి వదిలేశారని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏడాది లోపు 56 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలో భాగంగా అధికారంలోకి రాగానే రాష్ట్ర మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. ఆరు గ్యారంటీలపై విమర్శలు చేసే వారు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అమలవుతుందో లేదో తెలుసుకోవడానికి మీ మహిళలను ఎక్కిస్తే తెలుస్తుందన్నారు. మీ మహిళలను టికెట్ అడిగితే మమ్మల్ని అడగండి. లేకుంటే మీరైన బస్సు ఎక్కి చూడండి. కాంగ్రెస్ అమలు చేసిన ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కనిపిస్తుందని అన్నారు.

పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడానికి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన రాజీవ్ ఆరోగ్యశ్రీ నిమీరు గాలికి వదిలేస్తే.., ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీ 5 లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయలకు పెంచి చిత్తశుద్ధితో అమలు చేస్తున్నమని తెలిపారు. 2 లక్షల రూపాయల రైతుల రుణమాఫీ కొరకు 22 వేల కోట్ల రూపాయలను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసిన చరిత్ర ప్రజా ప్రభుత్వానిదన్నారు. అసెంబ్లీఎన్నికల ముందు రైతు బంధు డబ్బులు ఇవ్వకుండా మీరు (బిఆర్ ఎస్) ఎగ్గొట్టన డబ్బులను అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో ఒకే రోజు రూ.7,624 కోట్లు జమ చేసిందన్నారు. వ్యవసాయ యోగ్యమైన భూములు అన్నింటికీ రైతు భరోసా ఇస్తున్నామని, రూ.8400 కోట్ల రూపాయలు రైతు భరోసా కోసం వెచ్చించడానికి ప్రాథమిక అంచనా వేసి ఈనెల 26 నుంచి రైతుల ఖాతాల్లో ఈ డబ్బులను జమ చేయబోతున్నట్టు ప్రకటించారు. భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా ఏడాదికి రూ. 12వేల రూపాయలు ఇస్తామని, ఈనెల 26 తర్వాత మొదటి విడత ఇన్స్టాల్మెంట్ డబ్బులు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో వేస్తామని వెల్లడించారు. రైతులు పండించిన సన్న ధాన్యానికి క్వింటాకు 500 రూపాయలు చొప్పున రైతులకు బోనస్ చెల్లిస్తున్నామని చెప్పారు.

పది సంవత్సరాలు అధికారంలో ఉండి డైట్ చార్జీలు పెంచకుండా గాలికి వదిలేస్తే.., విద్యార్థుల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తుగా ఆలోచించి 40 శాతం డైట్ చార్జీలు పెంచడంతో పాటు 200% కాస్మోటిక్ ఛార్జీలు పెంచిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించడానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటుకు బడ్జెట్లో రూ.5వేల కోట్లు కేటాయించామన్నారు. అదే విధంగా రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తున్నామన్నారు. తెలంగాణలో చదువుకున్న ప్రతి బిడ్డకు ప్రభుత్వ, ప్రయివేటు, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. పది సంవత్సరాలు అధికారంలో ఉండి మీరు చేయలేని ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కేవలం ఏడాదిలోనే ప్రజా ప్రభుత్వం చేసిందన్నారు.

మూడెకరాలు భూమి, ఇంటికో ఉద్యోగం, ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు తగ్గకుండా సాగునీరు ఇస్తామని ఇచ్చిన హామీలను గత పాలకులు విస్మరించారని విమర్శించారు. గత పాలకుల మాధిరిగా కాకుండా ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి ప్రజల కోసం కాంగ్రెస్ పనిచేస్తుందన్నారు. గత పాలకుల మాధిరిగా విలాసాలకు, అనవసర ఖర్చులకు ప్రజాధనాన్ని ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టమన్నారు. సంపద సృష్టించి సృష్టించిన సంపదను ప్రతి ఒక్కరికి పంచడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఈ రాష్ట్రానికి లక్ష కోట్లు పెట్టుబడులు తీసుకురావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు దావోస్ వెళ్లారని తెలిపారు. గతంలో దావోస్లో పర్యటించి ఈ రాష్ట్రానికి 46 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకువచ్చారని, ఈ పర్యటనలో రూ. లక్ష కోట్లకు తగ్గకుండ పెట్టుబడులు తీసుకురవాడానికి కావాల్సిన ప్రణాళికలు తయారు చేసుకొని దావోస్ వెళ్లారని వివరించారు.

న్యూ ఎనర్జీ పాలసీని తీసుకువచ్చి 2035 సంవత్సరం నాటికి రాష్ట్రంలో 40 వేల మెగావాట్ల క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి ప్రజా ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేసుకుని ముందుకు పోతున్నదన్నారు. అదే విధంగా హైదరాబాద్ నగర అభివృద్ధి, ఫ్యూచర్ సిటీ ఏర్పాటు, రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో కొత్తగా రానున్న పరిశ్రమలు, హౌజింగ్ టౌన్ షిప్ల ఏర్పాటుతో పెరుగనున్న విద్యుత్ డిమాండ్ ను పరిగణలోకి తీసుకొని 2029- 30 సంవత్సరం నాటికి 22,448 మెగావాట్లు, 2034 -35 నాటికి 31,809 మెగావాట్ల పీక్ డిమాండ్ కు అనుగుణంగా నిరంతరం నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడానికి ప్రజా ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేసుకొని కసరత్తు మొదలుపెట్టిందన్నారు. గత మార్చి 8న 15,623 మెగావాట్ల పిక్ డిమాండ్ ను తట్టుకొని నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసిన శక్తి సామర్ధ్యాలు తెలంగాణ విద్యుత్ శాఖకు ఉందని చాటి చెప్పడం గర్వంగా ఉందన్నారు. గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ న్యూ ఎనర్జీ పాలసీని తీసుకురాకుండా గాలికి వదిలేసి రాష్ట్రానికి ఆన్యాయం చేసిందన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 2004లో ప్రవేశపెట్టిన వ్యవసాయ ఉచిత విధ్యుత్తు పథకాన్ని ప్రజా ప్రభుత్వం ముందుకు తీసుకు పోతున్నదని రాష్ట్రంలోని 28 లక్షల వ్యవసాయ పంప్ సెట్లకు ఉచితంగా విద్యుత్తును అందిస్తున్నట్టు చెప్పారు.

వ్యవసాయ పంపుసెట్ల ద్వారా రైతులకు అందిస్తున్న ఉచిత కరెంటుకు సంబంధించి రూ.8,729 కోట్లను ఆర్ధిక శాఖ నుంచి రైతుల పక్షాన డిస్కములకు ప్రభుత్వం చెల్లిస్తున్నదన్నారు. గత మార్చి ఒకటి నుంచి అమలు చేస్తున్న గృహ జ్యోతి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల రూ. 148.5 కోట్లు చెల్లిస్తున్నదని, ఇప్పటి వరకు విద్యుత్ శాఖకు రూ. 1485 కోట్ల రూపాయలను చెల్లించినట్టు వెల్లడించారు. రాష్ట్రంలో 25 గ్రామాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి సోలార్ గ్రామాలుగా మార్చబోతున్నామని, ఆగ్రామాల్లో వ్యవసాయ పంపు సెట్లకు, గృహాలకు రూప్ టాప్ సోలార్ ఏర్పాటు ప్రక్రియ మొదలైందన్నారు. వైద్య శాఖలో ఏర్పాటు చేసిన అంబులెన్స్ తరహాలో విద్యుత్తు శాఖలో కూడ అత్యవసర వాహనాలను ఏర్పాటు చేశామని, ఇందులో ఒక ట్రాన్స్ఫార్మర్, వైరు, ఇతర పరికరాలు ఉంటాయని 1912 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసిన సమస్య ఉందని చెప్పిన ప్రదేశానికి వచ్చి విద్యుత్తు సమస్యను పరిష్కరిస్తారని, ఈసేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. విద్యుత్ శాఖ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్న డి.ఏ విడుదల చేశారు.
