Menu

  • Home
  • తెలంగాణ
  • పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు.. ఇక శరవేగంగా ప్రాజెక్టు పనులు
Image

పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు.. ఇక శరవేగంగా ప్రాజెక్టు పనులు

ఉమ్మడి మహబూబ్ నగర్ లోని పాలమూరు-రంగారెడ్డి సాగునీటి ఎత్తి పోతల పథకానికి కేంద్ర పర్యావరణ అనుమతి లభించింది. ఈ పథకం నిర్మాణ పనులు వేగవంతం కానున్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఈ ఎత్తిపోతల నిర్మాణానికి పర్యావరణ అనుమతుల కమిటీ ఆమోదం తెలిపింది. కేంద్ర పర్యావరణ, ఫారెస్ట్ మినిస్ట్రీ పరిధిలోని పర్యావరణ అనుమతుల కమిటీ గత నెల 24వ తేదీన నిర్వహించిన 49వ మీటింగ్ మినిట్స్‌ను గురువారం విడుదల చేసింది. పాలమూరు ఎత్తిపోతల పనులలో కొన్ని పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయని, దానికి సంబంధించి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రాజెక్టు అథారిటీని ఈఏసీ ఆదేశించింది. ఆ చర్యలను నిర్దేశిస్తూ శరతులతో కూడిన ఆమోదం తెలిపింది.

2016లో మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లా, నల్గొండ ఉమ్మడి జిల్లాలలకు దాదాపు 12 లక్షల ఎకరాలకు సాగునీరు, వేలాది గ్రామాలకు త్రాగునీరు అందించే లక్ష్యంతో ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది. శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా రోజుకు ఒకటిన్నర టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 90 టీఎంసీలను ఎత్తిపోసే విధంగా పనులను ప్రారంభించారు. ఇప్పటికే తొలిదశ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇక ఈ అనుమతులు రావడం వల్ల రెండోదశ పనులు వేగంగా జరుగుతాయని ప్రభుత్వం వెల్లడించింది.

Share the post