జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (Jubilee Hills ByPoll 2025 ) ప్రశాంతంగా ముగిసింది. కొన్ని చెదురు మదురు ఘటనలు మినహా పెద్దగా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్, సాయంత్రం 6 గంటల వరకు క్యూలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. మొత్తం ఓటర్లలో కేవలం 48.47 శాతం మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఉప ఎన్నిక పోలింగ్ మందకొడిగా సాగింది. ఉదయం వేళ, మధ్యాహ్నం వరకు పోలింగ్ బూత్లు ఖాళీగా కనిపించాయి. ముఖ్యంగా యువత పెద్దగా ఓటు వేసేందుకు ముందుకు రాకపోవడంతో పోలింగ్ మందగించింది. ఉదయం 9 గంటల వరకు కేవలం 10.2 శాతం ఓటింగ్ మాత్రమే నమోదు అయింది.
పోలింగ్ ప్రక్రియలో సాంకేతిక సమస్యలు ఓటర్లను కొంత ఇబ్బంది పెట్టాయి. నియోజకవర్గంలోని 11 చోట్ల ఈవీఎంలు (EVMs) మొరాయించాయి. దీంతో ఓటర్లు కొద్దిసేపు నిరీక్షించాల్సి వచ్చింది. అయితే, అధికారులు వెంటనే స్పందించి ఈవీఎంలను సరిచేయడంతో పోలింగ్ తిరిగి కొనసాగింది. ఉప ఎన్నిక బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ, ప్రధాన పార్టీల మధ్యే గట్టి పోటీ కనిసిస్తుంది.
Also Read..| మీ బరువెంత.? ప్రెస్ మీట్ లో నటి గౌరీ కిషన్ కు చేదు అనుభవం
ఈ ఉప ఎన్నిక ఫలితాల కోసం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పోలైన ఓట్ల లెక్కింపు ఈ నెల 14న కోట్లా విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జరగనుంది. ఈ తక్కువ పోలింగ్ శాతం ప్రధాన పార్టీల విజయావకాశాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియాలంటే ఫలితాల వెల్లడి వరకు ఆగాల్సిందే. తక్కువ ఓటింగ్ శాతం ఏ పార్టీకి అనుకూలంగా మారుతుంది? అధికార, ప్రతిపక్ష పార్టీల వ్యూహాలు ఏ మేరకు పనిచేశాయి? అనే ప్రశ్నలకు 14వ తేదీన సమాధానం లభించనుంది.









