Menu

  • Home
  • తెలంగాణ
  • తెలంగాణ సచివాలయ ప్రాంగణంలో నూతన గుడి, మసీదు, చర్చిలను ప్రారంభించిన సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై
Image

తెలంగాణ సచివాలయ ప్రాంగణంలో నూతన గుడి, మసీదు, చర్చిలను ప్రారంభించిన సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై

సచివాలయం ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన నల్లపోచమ్మ గుడి, మసీదు, చర్చిలను సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై ప్రారంభించారు. ఆలయం వద్ద నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం, గవర్నర్ లు ఇరువురూ పాల్గొన్నారు. ఆ తరువాత చర్చి, మసీదు ప్రారంభ వేడుకల్లో పాల్గొన్నారు.

సచివాలయానికి మొదటిసారి వచ్చిన గవర్నర్ కు సీఎం కేసీఆర్ ఘనంగా స్వాగతం పలికారు. గతంలో సచివాలయ ప్రారంభోత్సవానికి సైతం గవర్నర్ తనకు ఆహ్వానం అందలేదని చెప్పిన విషయం తెలిసిందే. అయితే, నిన్న రాజ్ భవన్ లో పట్నం మహెందర్ రెడ్డి మంత్రగా ప్రమాణ స్వీకారోత్సవానికి రాజ్‌ భవన్ కు వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ తో ప్రత్యేకంగా 20 నిముషాల పాటు సమావేశం అయ్యారు. సచివాలయంలోని ప్రార్ధనా మందిరాల ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించారు. ఆ మేరకు గవర్నర్ ఈ రోజు సచివాలయానికి వచ్చారు. సచివాలయ సందర్శనకు సీఎం గవర్నర్ ను తీసుకువెళ్లారు. గవర్నర్ కు సచివాలయ ప్రాంగణాన్ని కలియదిరిగి చూయించారు. ఒక్కో ఫ్లోర్ గురించి వివరించారు. అనంతరం గవర్నర్ కు సాంప్రదాయ పద్ధతిలో ఆహ్వానం పలుకుతూ సీఎం తన ఛాంబర్ కి తోడ్కొని వెళ్ళి, శాలువాతో సత్కరించి పూల బొకేను అందించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బొట్టు, కుంకుమలతో గవర్నర్ ని సాంప్రదాయ పద్ధతిలో సన్మానించారు. అనంతరం హై ‘టీ’ తో గవర్నర్ కు సీఎం ఆతిథ్యమిచ్చారు.

మొత్తానికి ప్రగతి భవన్ కు రాజ్ భవన్ కు దూరం తగ్గిందనే సంకేతాల కనిపిస్తున్నాయి. కార్యక్రమం అనంతరం గవర్నర్ కు ప్రత్యేక జ్ఞాపికను ప్రభుత్వం తరపున అందించి సన్మానించారు. ఈకార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share the post