బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. మహిళల విద్యకు ఆద్యురాలిగా నిలిచి, సమానత్వానికి పోరాడిన సావిత్రిబాయి పూలే జయంతి (జనవరి 3)ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సావిత్రి బాయి పూలే ఆశయాల సాధనకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ఫూలె దంపతుల సేవలను త్యాగాలను గుర్తు చేసుకున్నారు. భారత సమాజంలో చారిత్రాత్మకమైన మార్పుకు సావిత్రీబాయి ఫూలే పునాది వేశారని అన్నారు. మహిళల విద్యకు ప్రాధాన్యం కల్పించి, అణచివేయబడిన వర్గాలకు న్యాయం అందించేందుకు తమ జీవితాన్ని ఆర్పించారని గుర్తు చేసుకున్నారు. లింగ వివక్ష, కుల అసమానతలపై ఆమె చేసిన పోరాటం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని అన్నారు. సావిత్రీబాయి ఆశయాలను సాధించేందుకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. కోటి మంది మహిళలను కోటిశ్వరులను చేయాలనే లక్ష్యంతో మహిళల సాధికారతకు పెద్దపీట వేయటంతో పాటు, ఆడబిడ్డలకు అన్ని రంగాల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించే నైపుణ్యాల వృద్దికి వినూత్న కార్యక్రమాలు చేపట్టిందని చెప్పారు. బీసీలు, బడుగు, బలహీన వర్గాల సామాజిక, రాజకీయ అభ్యున్నతికి పాటుపడే భవిష్యత్తు ఆలోచనలతో రాష్ట్రంలో సమగ్ర ఇంటింటి సర్వేను తమ ప్రభుత్వం ఇటీవలే పూర్తి చేసిందని అన్నారు.

మహిళలను అక్షరాస్యులను చేయడానికి సావిత్రిబాయి ఫూలె ఎంతో శ్రమించారని, ఆమె త్యాగాన్ని, కృషికి గుర్తింపుగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళ టీచర్లు సావిత్రి భాయి జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రతి ఏడాది ఘనంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.