మున్నూరు కాపు కార్పోరేషన్ కు ఛైర్మన్ ను వెంటనే నియమించాలని కోరుతూ తెలంగాణ వెనుకబడిన తరగతుల సాధికారత సంఘం ఆధ్వర్యంలో మన్నూరు కాపు సంఘం నేతలు శుక్రవారం మంత్రి కొండా సురేఖను జూబ్లిహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మున్నూరు కాపులకు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చేదిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి విషయాన్ని తీసుకుపోవాలని వారు మంత్రి సురేఖను కోరారు. మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య ఆధ్వర్యంలో పలు జిల్లాలకు చెందిన మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు ఈ సందర్బంగా మంత్రి సురేఖని సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. కాపుల సంక్షేమం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో వున్నదని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి విషయాన్ని తీసుకుపోయి త్వరిత కాలంలోనే మున్నూరు కాపు కార్పోరేషన్ కు ఛైర్మన్ ను నియమించేలా చర్యలు చేపట్టడంతో పాటు, మున్నూరు కాపుల సంక్షేమంపై చర్చిస్తానని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. మున్నూరు కాపు కార్పోరేషన్ ను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే ఏర్పాటు చేసిన విషయాన్ని మంత్రి సురేఖ గుర్తు చేశారు.