తెలంగాణ భవన్లో నేడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ (BRSLP), రాష్ట్ర కార్యవర్గ కీలక సమావేశం జరగనుంది. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కానున్న ఈ భేటీలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు జిల్లా అధ్యక్షులు పాల్గొననున్నారు. ప్రధానంగా రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించడాన్ని ఎండగట్టడమే లక్ష్యంగా ఈ సమావేశం సాగనుంది. నీటి హక్కుల విషయంలో ప్రభుత్వాల తీరుపై ప్రజల్లోకి ఏ విధంగా వెళ్లాలనే అంశంపై ఈ సందర్భంగా కేసీఆర్ పార్టీనేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
Also Read..| మేడారం జాతర 2026 పోస్టర్ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
సమావేశానికి ముందు కేసీఆర్ నంది నగర్ నివాసంలో పార్టీ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సమావేశంలో చర్చించాల్సిన ప్రధాన అంశాలు, ప్రజాక్షేత్రంలో చేపట్టాల్సిన పోరాట కార్యాచరణపై వారితో సుదీర్ఘంగా చర్చించారు. ఇప్పటికే మండలి ప్రతిపక్ష నేత మధుసూదనా చారి కూడా కేసీఆర్ నివాసానికి చేరుకోగా, అక్కడ ప్రాథమిక చర్చలు ముగిసిన అనంతరం నేతలందరూ కలిసి తెలంగాణ భవన్కు బయలుదేరనున్నారు. సాగునీటి అంశంపై కేసీఆర్ ఈ వేదికగా ఎటువంటి ప్రకటన చేస్తారోనన్న ఆసక్తి నెలకొంది. మరోవైపు కేసీఆర్ ఈసమావేశం తరువాత సాయంత్రం 6 గంటలకు మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. కేసీఆర్ ఏం మాట్లడాతరానే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.









