హైదరాబాద్ కోకాపేటలో దొడ్డి కొమురయ్య (Doddi Komaraiah) కురుమ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శనివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. కురుమ సోదరులు నమ్మకానికి మారుపేరని.. మృదుస్వభావులని వారిని కొనియాడారు. అలాంటి సామాజిక వర్గం నుంచి వచ్చిన పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య అని గుర్తు చేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని ముందుండి నడిపిన గొప్ప పోరాట యోధుడని అన్నారు. ఆయన పేరుతో దొడ్డి కొమురయ్య భవన్ ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు.

కురుమ విద్యార్థులు చదువుకునేందుకు కావాల్సిన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందని సీఎం రేవంత్ తెలిపారు. ప్రభుత్వ హాస్టల్స్ లో డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి మనసు రాలేదని విమర్శించారు. కానీ, కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో డైట్ చార్జీలు పెంచి, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.

రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్ లాంటి అనేక సంక్షేమ పథకాల్లో బలహీనవర్గాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రొఫెసర్ కంచె ఐలయ్య చెప్పినట్లు జమీందార్ల తెలంగాణ తల్లి కాదు.. బహుజనుల తెలంగాణ తల్లిని మనం తెచ్చుకున్నామని సీఎం అన్నారు. ఈ తెలంగాణ తల్లి మన తల్లుల ప్రతిరూపమని అన్నారు. బిడ్డలు అభివృద్ధి పథం వైపు నడవాలని ఆశీర్వదించే తల్లిని మనం ప్రతిష్టించుకున్నామని వివరించారు.

కులగణనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. రాష్టంలో కులగణన 98 శాతం పూర్తయిందని, ఇంకా కేవలం 2 శాతం మాత్రమే మిగిలి ఉందని తెలిపారు. కులగణన తెలంగాణకు మెగా హెల్త్ చెకప్ లాంటిదని ఆయన అన్నారు. కులగణన పూర్తయితే కురుమలకు జనాభా ప్రాతిపదికన దక్కాల్సిన వాటా దక్కుతుందని అన్నారు. గత ఎన్నిల్లో కాంగ్రెస్ కురుమ సోదరులకు రెండు, యాదవ సోదరులకు రెండు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిందని గుర్తుచేశారు. అయితే, కలిసికట్టుగా ఆవ్యక్తులను గెలిపంచుకున్నప్పుడే రాజకీయ పార్టీలు మళ్లీ టికెట్లు ఇస్తాయని అన్నారు.

ముఖ్యమంత్రిగా ప్రభుత్వ విప్ లే తనకు కళ్లు, చెవులు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా ప్రభుత్వంలో నాలుగు సామాజిక వర్గాలకు విప్ లుగా అవకాశం కల్పించామన్నారు. బీర్ల ఐలయ్య విప్ గా ఉన్నాడు కాబట్టే కురుమల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాడని తెలిపారు. కురుమలకు వచ్చిన అవకాశం వదులుకోవద్దని.. మీ బిడ్డలను మీరు గెలిపించుకుంటేనే మీకు ప్రాధాన్యత ఉంటుందని సూచించారు.

వేర్వేరు పార్టీల్లో ఉన్నా… కొన్ని సందర్భాల్లో మీ సామాజిక వర్గాలను గెలిపించుకోవాలని, అప్పుడే ఈ సమాజంలో మీకు మనుగడ ఉంటుందని అన్నారు. ఈ ప్రభుత్వం మీది అని, కురుమల సమస్యలు పరిష్కరించే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు. భవిష్యత్ లో రాజకీయంగా, ఆర్ధికంగా కురుమల కోటా కురుమలకు వచ్చేలా చూసే బాధ్యత తనదని అన్నారు. ప్రొఫెసర్ కంచె ఐలయ్య (Kancha Ilaiah) సూచనను పరిశీలిస్తామని అన్నారు. దొడ్డి కొమురయ్య పేరు శాశ్వతంగా గుర్తుండిపోయే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
