రైతులను ఆర్థికంగా మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టారని వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. అందులో భాగంగానే నేడు రూ.37 వేల నుండి రూ.41 వేల మధ్యన ఉన్న రుణాలు మాఫీ చేసేందుకు గాను ఆర్థికశాఖ రూ.167.59 కోట్లు విడుదల చేసిందని అన్నారు. దీని ద్వారా 44,870 మంది రైతులకు లబ్దిచేకూరిందని మంత్రి తెలిపారు. బీఆర్ఎస్ అంటేనే రైతు సంక్షేమ పార్టీ అని మరోసారి నిరూపితం అయిందని హరీష్ రావు ట్వీట్ చేశారు.

రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసిందని ట్విట్టర్లో ఈ విధంగా తెలిపారు… అన్నదాతలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసే లక్ష్యంతో రైతు పక్షపాతి సీఎం శ్రీ కేసీఆర్ గారు రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఈ రోజు మొత్తం రుణమాఫీ కి సంబంధించి రూ.18,241 కోట్లకు ఆర్థిక శాఖ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ (బీఆర్వో) విడుదల చేసింది. మొదటి విడత లో భాగంగా రూ.37 వేల నుండి రూ.41 వేల మధ్య ఉన్న రైతు రుణాలను మాఫీ చేసేందుకు ఆర్థికశాఖ గురువారం రూ.237.85 కోట్లు విడుదల చేసింది. దీని ద్వారా 62,758 మంది రైతులకు లబ్దిచేకూరనుంది.
