సిద్ధిపేట జిల్లా, చెరియాల్ మండలం, అకునూర్ గ్రామానికి చెందిన జక్కు రాజయ్య కుమారుడు జక్కు చందు మెరైన్ కమాండో ఫోర్స్ (MARCOS) లో కమాండోగా ఎంపికయ్యారు. గత మూడు సంవత్సరాలుగా ముంబైలో భారత నౌకాదళంలో విధులు నిర్వహిస్తూ, తన అంకితభావం, క్రమశిక్షణతో ముందుకు సాగుతూ, భారత నౌకాదళానికి చెందిన అత్యంత ప్రతిష్టాత్మక విభాగం మెరైన్ కమాండో ఫోర్స్ (MARCOS) లో కమాండోగా ఎంపికై గ్రామానికే గర్వకారణంగా నిలిచారు.
Also Read..| ఆకునూరు సర్పంచ్ గా కొమ్మురవి ఘనవిజయం
దేశంలోనే అత్యంత కఠినమైనదిగా పేరొందిన గోవాలోని INS మాండోవి వద్ద 8 నెలల తీవ్ర శిక్షణను విజయవంతంగా పూర్తి చేసి ఈ ఘనత సాధించారు. ఈ శిక్షణలో కొద్దిమంది మాత్రమే విజయం సాధించగలుగుతారు. భారత దేశంలోనే (800) పోస్టులు. ఈ సందర్భంగా గ్రామస్తులు, యువత జక్కు చందును అభినందిస్తూ ఇది నిజంగా గర్వించదగిన క్షణమని కొనియాడుతున్నారు. ఈ విజయం అకునూర్ గ్రామానికి, సిద్ధిపేట జిల్లాకు ప్రత్యేక గర్వకారణం స్థానికులు అభినందిస్తున్నారు.
MARCOS కమాండోలు అంటే ఎవరు ?
MARCOS కమాండోలు జల, ఆకాశ మరియు భూతలం (Sea, Air, and Land) అనే మూడు విభాగాలలో పోరాడగల సామర్థ్యం కలిగిన వారు. అందుకే వీరిని “మొసళ్ళు” (Crocodiles) అని కూడా పిలుస్తుంటారు, ఎందుకంటే వీరు నీటిలో ఎంత వేగంగా పని చేస్తారో, భూమి మీద కూడా అంతే భీకరంగా పోరాడతారు.
తీర ప్రాంత రక్షణ, శత్రువుల నౌకలను ధ్వంసం చేయడం, సముద్రంలో బందీలుగా ఉన్నవారిని విడిపించడం వీరి ప్రధాన బాధ్యతలు. 26/11 ముంబై దాడుల సమయంలో తాజ్ హోటల్లో ఉగ్రవాదులను ఎదుర్కోవడంలో వీరు కీలక పాత్ర పోషించారు.










